వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్19 ప్రపంచ కప్ను టీమిండియా గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో బీసీసీఐ అండర్19 జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ. 40 లక్షల చొప్పున క్యాష్ రివార్డు ఇవ్వనుంది. సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేయనుంది. దీంతో ఆ జట్టులో భాగస్వామి, భారత్ విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు తేజం, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ రూ.40 లక్షల క్యాష్ రివార్డు లభించనుంది. కాగా ఆ మొత్తం నుంచి కొంత డబ్బుతో తన కుటుంబం కోసం ఒక చిన్న ఇల్లు కొనుగోలు చేస్తానని రషీద్ తెలిపాడు. వాస్తవానికి అంత డబ్బును తాను ఎప్పుడూ చూడలేదని రషీద్ సంతోషం వ్యక్తం చేశాడు.
సోమవారం షేక్ రషీద్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను మ్యాచ్లకు వెళ్లే ప్రతిసారి నాకు ఆర్ధిక ఇబ్బందులుండేవి. డబ్బులు లేక నా కుటుంబం పడ్డ ఇబ్బందులు నాకు బాగా తెలుసు. అయితే చాలా మంది నాకు సహకారమందించారు. ఒక్కసారిగా ఇంత మొత్తం అందుతుందంటే నమ్మబుద్ది కావడంలేదు. వాస్తవానికి అంత డబ్బు నేను ఎప్పుడూ చూడలేదు. మాకు ఇప్పటి వరకు చిన్న ఇల్లు కూడా లేదు. అందుకే మా కుటుంబ సభ్యులకు ఓ చిన్న ఇల్లు కొంటాను. మిగతా డబ్బును నా కెరీర్ కోసం ఖర్చు చేస్తాను. నేను ఈ స్థాయికి రావడానికి ఎందరో సహాయ సహకారాలు అందించారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ విజయం నా కెరీర్లో ఎంతో ప్రత్యేకం.
ముఖ్యంగా సెమీస్లో ఆస్ట్రేలియాపై 94, ఫైనల్లో ఇంగ్లండ్పై 50 పరుగులు సాధించి జట్టు విజయంలో నా వంతు సహకారం అందించడం మరువలేనిది. భవిష్యత్లో భారత సీనియర్ జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా కృషి చేస్తాను’ అని అన్నాడు. అండర్ 19 ప్రపంచకప్లో రషీద్ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో రషీద్ నాలుగు మ్యాచ్లు ఆడి 50.25 సగటుతో 201 పరుగులు సాధించాడు. కరోనా సోకడంతో రషీద్ రెండు మ్యాచ్లకు దూరమైయ్యాడు. మరి వరల్డ్ కప్లో రషీద్ ప్రదర్శన, అతనికి రానున్న క్యాష్ రివార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.