వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్19 ప్రపంచ కప్ను భారత జట్టు కైవసం చేసుకుని విశ్వవిజేతగా నిలిచింది. యష్ ధుల్ కెప్టెన్గా, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ వైస్ కెప్టెన్గా టీమిండియా ఐదోసారి అండర్ 19 వరల్డ్ కప్ను ముద్దాడింది. ఈ అద్భుత విజయంలో తెలుగు తేజం షేక్ రషీద్ పాత్ర చాలా ఉంది. ప్రపంచ కప్లో ఆడిన నాలుగు మ్యాచ్లలో రషీద్ కీలకమైన సెమీ ఫైనల్, ఫైనల్లలో అద్భుతమైన హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆ రెండు మ్యాచ్లలో గెలుపునకు అవసరమైన కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. దీంతో రషీద్ పేరు ఏపీలో మారుమెగుతోంది. ముఖ్యంగా అతని సొంత జిల్లా గుంటూరులో రషీద్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మల్లయ పాలెంకు చెందిన రషీద్ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. తండ్రి బలీషా వలీ లోన్ రికవరీ ఏజెంట్. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్నా.. కొడుకుకి క్రికెట్పై ఉన్న ఆసక్తిని గమనించి, అతన్ని ప్రొత్సహించాడు. దాంతో తొమ్మిదేళ్లకే అండర్-14 క్రికెట్లో అరంగేట్రం చేసిన రషీద్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. అంతర్ జిల్లా పోటీల్లో శ్రీకాకుళంపై పన్నెండేళ్ల వయస్సులోనే ట్రిపుల్ సెంచరీ కొట్టి అందరి దృష్టి ఆకర్షించాడు. 2017లో అండర్-16 కేటగిరీలో 674 పరుగులు చేసి ఆ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. తర్వాతి ఏడాది అండర్-19లో 680 రన్స్తో నేషనల్ లెవెల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో సెకండ్ ప్లేస్ కైవసం చేసుకున్నాడు.
తాజాగా అండర్-19 వరల్డ్ కప్లో వీరబాదుడుతో మరోసారి తన టాలెంట్ను ప్రపంచ క్రికెట్కు పరిచయం చేశాడు. రషీద్ బ్యాటింగ్ స్టైల్ ప్రత్యేకం. అతను డిఫెన్సింగ్ క్రికెట్తో పాటు హార్డ్ హిట్టింగ్ కూడా చేయగలడు. అందుకే అతన్ని డిఫెన్స్లో ద్రవిడ్.. వీరబాదుడిలో సెహ్వాగ్ లాంటోడని అంటుంటారు. అతని మణికట్టు ఆట సెలెక్టర్లను సైతం ఎంతగానో ఆకట్టుకున్నట్లు సమాచారం. రషీద్ త్వరలో భారత జాతీయ జట్టులో చోటు సంపాదిస్తాడని క్రికెట్ నిపుణులతో పాటు అతని కుటుంబసభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి మన తెలుగు తేజం, గుంటూరు మిర్చి లాంటి రషీద్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.