అధికారుల అత్యుత్సాహం, అవగాహన లేనితనంతో కొన్నిసార్లు ప్రముఖులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ క్రమంలోనే టీమిండియా యువ క్రికెటర్లు, అండర్19 వరల్డ్ కప్ హీరోలు ఎయిర్పోర్టులో తీవ్ర అవమానం ఎదుర్కొవాల్సి వచ్చింది. వెస్టిండీస్ వేదికగా ఇటీవల ముగిసిన అండర్ 19 వన్డే ప్రపంచకప్ను గెలుచుకుని యువ భారత్ చరిత్ర సృష్టించింది. అయితే ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టే క్రమంలో యువ భారత జట్టుకు కొంత ఇబ్బంది ఎదురైంది.
కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేని కారణంగా ఏడుగురు భారత క్రికెటర్లను పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఎయిర్ పోర్టు అధికారులు అడ్డుకున్నారని జట్టు మేనేజర్ లోబ్జాంగ్ జీ టెన్జింగ్ తాజాగా వెల్లడించాడు. భారత్లో టీనేజీ కుర్రాళ్లకి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించలేదని ఎంత వివరించినా ఇమిగ్రేషన్ అధికారులు పట్టించుకోలేదని ఆయన తెలిపాడు. ఏకంగా ఓ రోజు మొత్తం ఎయిర్పోర్టులోనే ఉంచారని చెప్పాడు. అంతేకాకుండా ఆ ఏడుగురు ఆటగాళ్లను తర్వాతి ఫ్లైట్కే భారత్కు తిరిగి వెళ్లిపోవాలని బెదిరించారని చెప్పుకొచ్చారు. భారత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేవరకు వారిని విండీస్ గడ్డపై అడుగుపెట్టనిచ్చేది లేదని ఎయిర్పోర్టు అధికారులు హెచ్చిరించినట్లు పేర్కొన్నారు.
ఎయిర్పోర్టు అధికారులు అడ్డుకున్న ఏడుగురిలో భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన రవికుమార్, రఘువంశీ తదితరులు ఉన్నట్లు లోబ్జాంగ్ జీ టెన్జింగ్ వివరించారు. 24 గంటల తర్వాత ఐసీసీ, బీసీసీఐ అధికారుల చొరవతో ఎయిర్పోర్టు అధికారులు వెనక్కి తగ్గినట్టు చెప్పాడు. ఆ తర్వాత వరల్డ్ కప్ గెలిచిన జట్టును ఆ అధికారులే దగ్గరుండి ఆటగాళ్లకు సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చింది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.