భారత్-బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ టీమిండియా ఓటమి పాలైంది. ఊహించని ఈ ఓటములతో టీమిండియా ఆటగాళ్లతో పాటు, క్రికెట్ అభిమానులు సైతం కుంగిపోయారు. అదే సమయంలో భారత జట్టులో తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నాయి. పసికూన బంగ్లాదేశ్పై ఇలాంటి దారుణ ఓటములు తాము ఊహించలేదంటూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మండపడుతున్నారు. తొలి రెండు మ్యాచ్ల్లోనూ గెలవాల్సిన స్థితి నుంచి టీమిండియా ఓటమి పాలైంది. ఏదో గాలి వాటం విజయాలు కాకుండా.. బంగ్లాదేశ్ పోరాడి భారత్పై గెలిచింది.
ఇప్పటికే రెండు ఓటములతో మూడు వన్డేల సిరీస్ను కోల్పోయిన టీమిండియా.. కనీసం చివరి వన్డేలోనైనా గెలిచి క్లీన్ స్వీప్తో మరింత పరువుపోకుండా జాగ్రత్త పడాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే.. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వన్డేలో గాయపడ్డంతో.. అతని స్థానంలో కేఎల్ రాహుల్ మూడో వన్డేకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అలాగే వన్డే స్క్వాడ్కు కుల్దీప్ యాదవ్ను సైతం మూడో వన్డే కోసం జోడించారు. మ్యాచ్ ఆరంభమైన కొద్ది సేపటికే సిరాజ్ బౌలింగ్లో అనముల్ హక్ ఇచ్చిన క్యాచ్ను సెకండ్ స్లిప్లో ఉండి.. అందుకునే క్రమంలో ఎడమ చేయి బొటనవేలికి గాయమైంది. వెంటనే గ్రౌండ్ వీడిన రోహిత్.. ఆస్పత్రికి సైతం వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత కూడా ఫీల్డింగ్కు రాని రోహిత్.. మ్యాచ్ ఓడిపోయే పరిస్థితుల్లో తప్పక 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి.. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ.. విజయానికి 5 పరుగుల దూరంలో టీమిండియా ఆగిపోయింది.
చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సిన దశలో.. రెండు ఫోర్లు బాదిన రోహిత్.. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరమైన దశలో ఐదో బంతికి సిక్స్ కొట్టిన రోహిత్.. చివరి బంతికి కూడా భారీ సిక్స్కు ప్రయత్నించి విఫలం అయ్యాడు. దీంతో 5 పరుగులతో మ్యాచ్ గెలిచిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. సంబురాల్లో మునిగిపోయారు. టీమిండియా లాంటి పటిష్టమైన జట్టుపై తొలి వన్డే సిరీస్ గెలిచిన ఆనందంలో వారంతా ఉబ్బితబ్బిబయ్యారు. ఈ క్రమంలోనే.. బంగ్లా బౌలర్.. ఇబాదత్ హుస్సేన్ వికెట్లు పీకి సంబురాలు చేసుకున్నాడు. కానీ.. ఫీల్డ్ అంపైర్ వచ్చి.. అతని చేతుల్లో ఉన్న స్టంప్స్ను లాక్కున్నాడు. గతంలో కూడా మ్యాచ్ గెలిస్తే.. ఆటగాళ్లు వికెట్లు తీసుకుని సెలబ్రేట్ చేసుకునే వారు. కానీ.. ఇప్పటి వికెట్లలో మిడిల్ స్టంప్స్కు మైక్ కనెక్ట్ చేసి ఉంచడంతో.. ఆ వికెట్లను ఆటగాళ్లు ముట్టుకోకూడదు. ఈ విషయం తెలియని ఇబాదత్.. స్టంప్ తీసుకోవడంతో అంపైర్ అతని వద్దకు వెళ్లి.. ఆ స్టంప్ను కలెక్ట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగ్లా బౌలర్కు అవమానం జరిగిదంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.