ఢిల్లీ వేదికగా సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన మూడోదైన చివరి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ప్రొటీస్ టీమ్ను చిత్తు చేసి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్లో ఓడినా.. తిరిగి పుంజుకుని చివరి రెండో మ్యాచ్లను గెలిచి భారత్ ఈ వన్డే సిరీస్ను ఖాతాలో వేసుకుంది. టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఒక టీమ్ ఆస్ట్రేలియా వెళ్లగా.. కుర్రాళ్లతో కలిసి సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ అద్భుతాలు చేస్తున్నాడు. దీనికంటే ముందు కూడా పలు సిరీస్ విజయాలు సాధించిన ధావన్.. ఇప్పుడు బలమైన సౌతాఫ్రికాను మట్టికరిపించాడు. ఈ సిరీస్లో ఇషాన్ కిషన్, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించారు.
ఇక ఈ సిరీస్ విజయంతో టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో రచ్చరచ్చ చేశారు. సాధారణంగానే సెలబ్రేషన్స్కు పెట్టింది పేరైన శిఖర్ ధావన్.. కుర్రాళ్లతో డాన్స్లు వేయించాడు. హిందీ పాటకు టీమ్ అంతా కలిసి చిందులు తొక్కారు. కెప్టెన్ ధావన్ ముందుండి నడిపించగా.. సిరాజ్, కుల్దీప్, రాహుల్ త్రిపాఠి, రవి బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, షాబాజ్, వాషింగ్టన్ సుందర్ పిచ్చిపిచ్చిగా ఎగిరారు. ఇక ఇలాంటి రచ్చకు దూరంగా ఉండే సంజు శాంసన్ అదే పాటించాడు. గతంలోనూ పలు సిరీస్ విజయాలు, మ్యాచ్ గెలుపుల తర్వాత శిఖర్ ధావన్ అండ్ కో ఇలానే ఒక రేంజ్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను సిరాజ్, కుల్దీప్ దారుణంగా దెబ్బ తీశారు. వీరి ధాటికి ప్రొటీస్ జట్టు కేవలం 99 పరుగులకే కుప్పకూలింది. 27.1 ఓవర్లలో 99 పరుగులు చేసి ఆలౌట్ అయింది. క్లాసెన్ 34 పరుగులుతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అవ్వడంతో టీమిండియా సౌతాఫ్రికా అత్యంత స్వల్ప స్కోర్ను నమోదు చేసింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్ 2, వాషింగ్టన్ సుందర్ 2, షాబాజ్ అహ్మెద్ 2, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టారు. 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శుబ్మన్ గిల్ 57 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ ఫామ్ను కొనసాగిస్తూ.. 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
Dhawan and his boys are back. pic.twitter.com/3lcKBEnq1Z
— Johns. (@CricCrazyJohns) October 11, 2022