ప్రత్యర్థి బ్యాటర్లను వణికించే బౌలర్ ఒక్కరు కూడా భారత జట్టులో లేరని ఓ పాకిస్థాన్ బ్యాటర్ సెటైర్లు వేశాడు.
క్రికెట్ ఆడే దేశాలు ఎన్నో ఉన్నప్పటికీ జెంటిల్మన్ గేమ్కు ఎక్కువ క్రేజ్ మాత్రం ఆసియాలోనే. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ల్లో క్రికెట్ను ఒక మతంలా భావించేవాళ్లు కోట్లాది మంది ఉన్నారు. అందుకే క్రికెట్ ఆడే అన్ని దేశాలకు కలిపి వరల్డ్ కప్ రూపంలో మెగా టోర్నీ ఉన్నా.. ఆసియా కంట్రీస్ కోసం స్పెషల్గా ఆసియా కప్ నిర్వహిస్తుంటారు. ఈ టోర్నీలో గెలిచిన జట్టును ఆసియాలో బెస్ట్ టీమ్గా పిలుస్తుంటారు ఫ్యాన్స్. అలాంటి ఆసియా కప్కు ఈసారి పాకిస్థాన్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. భారత్, పాకిస్థాన్ తలపడే మ్యాచ్లు మాత్రమే లంకలో జరగనున్నాయి. మిగతా మ్యాచ్లకు పాక్ వేదికగా నిలవనుంది. ఈ టోర్నీకి మరో రెండు నెలల టైమ్ ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతున్నాయి. గతేడాది ఆసియా కప్లో భారత్ను ఓడించిన పాక్.. ఈసారి కూడా అదే రిపీట్ అవ్వాలని భావిస్తోంది.
ఆసియా కప్-2022 ఫైనల్లో పాకిస్థాన్ చేతుల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ అనుకుంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా పాక్ ఓపెనర్ అహ్మద్ షెహ్జాద్ భారత జట్టు బౌలింగ్ యూనిట్పై సంచలన కామెంట్స్ చేశాడు. భారత జట్టు అంటే తనకు గౌరవం అని చెప్పిన షెహ్జాద్.. వారిని అవమానించడం తన ఉద్దేశం కాదన్నాడు. అయితే ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టే ఒక్క బౌలర్ కూడా టీమిండియాలో లేడని షెహ్జాద్ చెప్పుకొచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు మంచి బౌలర్లేనని.. కానీ వాళ్లు అంత డేంజరస్ కాదన్నాడు. పాక్ జట్టులో షోయబ్ అక్తర్ లాంటి బౌలర్ ఉండేవాడని.. అతడ్ని చూస్తే బ్యాటర్లు భయపడేవాళ్లన్నాడు షెహ్జాద్. టీమ్లోకి వచ్చిన కొత్తలో అక్తర్ బౌలింగ్లో తాను చుక్కలు చూశానని తెలిపాడు. అక్తర్ బౌలింగ్ ఫేస్ చేసేందుకు ఇంటర్నేషనల్ బ్యాటర్లు మాత్రమే కాదు.. నెట్స్లో సొంత టీమ్మేట్స్ కూడా భయపడేవాళ్లని షెహ్జాద్ వ్యాఖ్యానించాడు.