ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో ఆదివారం రెండు అద్భుతాలు జరిగాయి. ఒకటి సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. రెండోది అసలు అవకాశం కూడా లేదు అనుకున్న పాకిస్తాన్ జట్టు సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. మొదటి రెండు మ్యాచ్లు ఓడిన పాక్.. మిగిలిన జట్లు చేసిన తప్పిదాల వల్ల పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరింది. ఇంక ఆదివారం జరుగుతున్న మరో మ్యాచ్ భారత్- జింబాబ్వే మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా రాణిస్తోంది. టాపార్డర్ కాస్త తడబడినట్లే కనిపిస్తోంది. రోహిత్ శర్మ కేవలం 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. అటు విరాట్ కోహ్లీ(26) కూడా ఆశించిన విధంగా రాణించలేదు.
ఇంక రిషబ్ పంత్ విషయానికి వస్తే.. ఫ్యాన్స్ పంత్ విషయంలో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ టీ20 వరల్డ్ కప్లో మొదటిసారి జింబాబ్వేపై తలపడేందుకు పంత్కు అవకాశం దక్కింది. కానీ, పంత్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. రాకరాక వచ్చిన బ్యాటింగ్ లో పంత్ కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. 5 బంతులు ఎదుర్కొన్న పంత్ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మొదటి నాలుగు బంతులు డిఫెన్స్ తో సరిపెట్టుకున్న పంత్ ఐదో బంతిని మాత్రం భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బాల్ బౌండరినీ క్లియర్ చేయలేదు. బౌండరీ లైన్ మీదున్న ర్యాన్ బ్లర్ అద్భుతమైన క్యాచ్ని అందుకున్నాడు.
నిజానికి ర్యాన్ బ్లర్ అందుకున్నది సాదాసీదా క్యాచ్ మాత్రం కాదు. బౌండరీ లైన్పై రన్నింగ్ చేసుకుంటూ వచ్చి క్యాచ్ పట్టుకుని ర్యాన్ బ్లర్ డైవ్ చేశాడు. ఈ టోర్నమెంట్లో పట్టుకున్న అద్భుతమైన క్యాచ్లలో ఇది కచ్చితంగా ఉంటుంది. ఏది ఏమైనా రిషబ్ పంత్ మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడనే చెప్పాలి. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణించాడు. కాకపోతే అర్ధశతకం అయిన వెంటనే రాహుల్ అవుట్గా పెవిలియన్ చేరాడు. ఇంక నిర్ణీత ఓవర్లలో భారత్ 186 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. విజయం కోసం జింబాబ్వే 187 పరుగులు చేయాల్సి ఉంది.