టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ గురించి తెలియని క్రికెట్ ఫ్యాన్ ఉండరు. గ్రౌండ్లో ఎలా ఉంటాడో, బయట కూడా అంతే చిల్గా ఉంటాడు యువీ. అలాంటి అతడి గురించి గంగూలీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
వరల్డ్ క్రికెట్కు టీమిండియా అందించిన గొప్ప లెఫ్టాండర్ బ్యాటర్లలో యువరాజ్ సింగ్ ఒకడు. కేవలం బ్యాట్స్మన్గానే గాక స్పిన్నర్గా, ఫీల్డర్గా ఆటపై ఎంతో ప్రభావం చూపాడు యువీ. దాదాపు రెండు దశాద్దాల పాటు భారత క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగాడు. ముఖ్యంగా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో యువీ జట్టులో ఉంటే అదో భరోసా. సుదీర్ఘ కాలంగా అందని ద్రాక్షలా ఉన్న వన్డే వరల్డ్ కప్తో పాటు టీ20 ప్రపంచ కప్ను భారత జట్టు అందుకోవడంలో యువీ పాత్ర ఎంతో ఉంది. టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లండ్పై మెరుపు హాఫ్ సెంచరీ, 6 బాల్స్లో 6 సిక్సుల అతడి ఇన్నింగ్స్ను అంత సులువుగా మర్చిపోలేం. ఇక, క్యాన్సర్ కారణంగా రక్తపు వాంతులతో ఇబ్బంది పడుతున్నా.. 2011 వన్డే వరల్డ్ కప్ మొత్తం అతడు ఆడిన ఆట నెక్స్ లెవల్ అనే చెప్పాలి. అలాంటి యువీ గురించి టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
యువీ కెరీర్ మొదట్లో జరిగిన ఒక విషయాన్ని దాదా గుర్తు చేసుకున్నాడు. ‘అది ఛాంపియన్స్ ట్రోఫీ. యువీ డెబ్యూ మ్యాచ్కు ముందు రోజు రాత్రి హోటల్లో కనిపించలేదు. దీంతో చాలా భయపడ్డా. 18 ఏళ్ల యువకుడు కదా.. రూమ్లో పుస్తకాలు చదువుకుంటూ కూర్చోలేడు. అందుకే హోటల్ సిబ్బందితో స్థానిక నైట్ క్లబ్స్పై ఆరాతీశా. వెళ్లి చూస్తే.. ఒక నైట్ క్లబ్లో ఉన్నాడు యువరాజ్. దీంతో వెంటనే అతడ్ని హోటల్కు తీసుకొచ్చా’ అని గంగూలీ ఆ రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. అప్పుడు భారత జట్టు కెప్టెన్గా ఉన్న గంగూలీ.. యువీ తనకు చెమటలు పట్టించాడన్నాడు. హోటల్ రూమ్కు వచ్చాక అతడ్ని దగ్గర తీసుకొని.. పలు సూచనలు చేశానన్నాడు. అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో అతడు 80కి పైగా రన్స్ చేశాడని.. కొన్ని వికెట్లు కూడా తీశాడని గంగూలీ మెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్లో కంగారూలపై భారత్ విజయం సాధించిందన్నాడు.