వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా జట్టుకి బిగ్ షాక్. ఆ జట్టులోని ఇద్దరి స్టార్ ప్లేయర్ల గాయాలు కంగారూల జట్టుని కలవరపెడుతున్నాయి.
ప్రపంచకప్ ఎప్పుడు జరిగినా.. ఎక్కడ జరిగినా ఆస్ట్రేలియా టైటిల్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. ఐసీసీ టోర్నీలంటే చెలరేగిపోయే కంగారూల జట్టు ఇప్పటివరకు రికార్డ్ స్థాయిలో 5 సార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచింది. భారత్ వేదికగా జరగబోయే వరల్డ్ కప్ లో కూడా ఆస్ట్రేలియా జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఇటీవలే 18 మంది సభ్యులతో కూడిన జట్టును వరల్డ్ కప్ కి ప్రకటించగా.. తాజాగా దక్షిణాఫ్రికాతో వన్డే, టీ 20 సిరీస్ కి జట్లను ప్రకటించేశారు. అయితే ఈ సిరీస్ కి ఆసీస్ మాజీ కెప్టెన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ గాయాల కారణంగా అందుబాటులో ఉండడం లేదు. వరల్డ్ కప్ ముందు ఇలా స్టార్ ప్లేయర్లు గాయపడడం ఆస్ట్రేలియా జట్టుని కలవరానికి గురి చేస్తుంది.
ప్రస్తుతం స్మిత్ మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా గాయపడిన ఈ స్టార్ బ్యాటర్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీని ప్రకారం స్మిత్ కి నాలుగు వారాల విశ్రాంతి అవసరం అని తెలుస్తుంది. దీంతో ఆసీస్ యాజమాన్యం వరల్డ్ కప్ ముందు ఈ స్టార్ బ్యాటర్ ని ఆడించి రిస్క్ చేయదలుచుకోవడం లేదని తెలుస్తుంది. మరో వైపు పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ గజ్జల్లో గాయం నుంచి పూర్తి ఫిట్ నెస్ సాధించలేదని తెలుస్తుంది. స్టార్క్ కి కూడా మరో నాలుగు నుంచి 5 వారాల విశ్రాంతి అవసరమని తెలుస్తుంది. దీంతో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు లేకుండానే ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడబోతుంది.
టీ 20 ల్లో స్మిత్ స్థానాన్ని ఆష్టన్ టర్నర్ రీప్లేస్ చేయగా.. వన్డేల్లో మాత్రం లబు షేన్ కి చోటు దక్కింది. అదే విధంగా స్టార్క్ ప్లేస్ లో కొత్త కుర్రాడు స్పెన్సర్ జాన్సన్ కి అవకాశమిచ్చారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడు టీ 20 లు, 5 వన్డేలు ఆస్ట్రేలియా ఆడనుంది. ఈ నెల 30 నుంచి అస్ట్రేలియా- సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య తొలి టీ 20 మ్యాచ్ తో ఈ పర్యటన స్టార్ట్ అవుతుంది. ఆసీస్ సారధి ప్యాట్ కమ్మిన్స్ ఇదివరకే గాయం కారణంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. కమ్మిన్స్ గైర్హాజరీలో మిచెల్ మార్ష్ ఆసీస్ జట్టుకి కెప్టెన్ గా వహరించనున్నాడు. మరి స్టార్ ప్లేయర్లు లేకుండా సఫారీ గడ్డ మీద అడుగుపెడుతున్న ఆసీస్ జట్టు ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.