ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఫ్రాంచైజీలు సన్నాహాలు మొదలుపెట్టేశాయి. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనున్న మెగా వేలంలో ఎవరిని తీసుకోవాలన్న విషయంపై క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త కోచ్, కెప్టెన్ల పైనా నెమ్మదిగా క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీమ్ కెప్టెన్ గా ఈ సారి ఎవరు ఉండబోతున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తే ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ విరాట్ కోహ్లీనే ఉండనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2013 నుంచి 2021 వరకూ ఆర్సీబీ కెప్టెన్గా కొనసాగిన విరాట్ కోహ్లీ.. ఒక్కసారి కూడా జట్టుని టైటిల్ విజేతగా నిలబెట్టలేకపోయాడు. దీంతో ఐపీఎల్ 2021 సీజన్లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. కెప్టెన్ గా వైదొలిగినప్పటకి బ్యాట్స్మెన్గా మాత్రం జట్టులో కొనసాగుతానని స్పష్టం చేశాడు. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ కెప్టెన్ గా జాతీయ జట్టుకు అన్ని పార్మాట్ల నుంచి వైదొలిగిన నేపథ్యంలో.. మళ్ళీ కోహ్లీనే నియమించాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటికే కోహ్లితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఛైర్మన్ ప్రథమేశ్ మిశ్రా కూడా ధృవీకరించారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుని విరాట్ కోహ్లీ కొన్ని సీజన్లలో అద్భుతంగా ముందుకు నడిపించాడని గుర్తుచేశాడు. కోహ్లీ సారథ్యంలో బెంగళూరు జట్టు చాలా మ్యాచ్లను గెలిచిందని, ఇప్పటికీ కూడా అతనికే ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్టు వెల్లడించాడు. గత ఏడాది కెప్టెన్సీ నుండి తప్పుకున్నప్పటకీ.. మళ్ళీ ఆ బాధ్యతలు తీసుకునేలా కోహ్లీని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని మిశ్రా తెలిపారు.
ఐపీఎల్ 2022 సీజన్ కోసం విరాట్ కోహ్లీ (రూ. 15 కోట్లు), గ్లెన్ మాక్స్వెల్ (రూ. 11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ. 7 కోట్లు)లను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ ఫ్రాంఛైజీ.. ఇప్పుడు కెప్టెన్ వేటలో ఉంది. ఐపీఎల్ 2022 ఆటగాళ్ల మెగా వేలం ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా జరగనుండగా.. వేలంలో ఉన్న ఆటగాళ్లలో నుంచి ఒకరిని కొనుగోలు చేసి వారికి కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించాల్సి ఉంది. అయితే.. విదేశీ క్రికెటర్కి ఆ బాధ్యతలు అప్పగిస్తే? జట్టుకి ఉన్న ఆదరణ తగ్గే అవకాశం ఉంది. అలా కాదని భారత ఆటగాడికే ఇవ్వాలనుకుంటే? శ్రేయాస్ అయ్యర్ మినహా ఎవరూ కెప్టెన్సీ అనుభవం ఉన్న ఆటగాళ్లు కనిపించడం లేదు. దాంతో.. మళ్లీ విరాట్ కోహ్లీనే కెప్టెన్గా చేసేందుకు ఆర్సీబీ ఫ్రాంఛైజీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరీ కోహ్లీ దీనికి అంగీకరిస్తాడా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి కోహ్లీని ఆర్సీబీ కెప్టెన్ గా కొనసాగుతాడని మీరు భావిస్తున్నారా.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.