పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్పై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. బాబర్ను అలా ఎలా అంటావంటూ అక్తర్పై పాక్ మాజీ క్రికెటర్లు సహా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే..!
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్పై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చైర్మన్ రమీజ్ రాజా ఫైర్ అయ్యాడు. పాక్ సారథి బాబర్ ఆజమ్కు ఇంగ్లీష్ రాదంటూ అక్తర్ చేసిన వ్యాఖ్యలను రమీజ్ తప్పుబట్టాడు. తానే గొప్ప, తనను మించి ఎవరూ లేరనే భ్రమల్లో నుంచి అక్తర్ బయటకు రావాలని చురకలంటించాడు. అసలేం జరిగిందంటే.. ఇటీవల ఒక ఛానెల్తో మాట్లాడిన అక్తర్.. పాకిస్థాన్ ప్లేయర్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బాబర్ ఆజమ్తో సహా అనేక మంది పాక్ ఆటగాళ్లకు ఇంగ్లీషు మాట్లాడటం రాదన్నాడు. తనతో పాటు షాహిద్ అఫ్రిదీ, వసీం అక్రమ్ మాత్రమే ధారాళంగా ఆంగ్లం మాట్లాడుతామని చెప్పుకొచ్చాడు.
ఇంగ్లీషు రాకపోవడం వల్లే బాబర్ ఆజమ్ బ్రాండ్ అంబాసిడర్ కాలేకపోయాడని, వాణిజ్య ప్రకటనలు దక్కించుకోవడం లేదని అక్తర్ అన్నాడు. దీంతో అతడి కామెంట్స్పై పాక్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఆ దేశ మాజీ క్రికెటర్లు అక్తర్ మీద విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే రమీజ్ రాజా కూడా అక్తర్ను విమర్శించాడు. ‘షోయబ్ అక్తర్ తనంత గొప్పోడు లేడనే భ్రమల్లో ఉంటాడు. గతంలో కమ్రాన్ అక్మల్తోనూ అతడికి సమస్య వచ్చింది. ప్రతి ఒక్కరినీ ఏదో రకంగా బద్నాం చేస్తుంటాడు. ఇలాంటి చెత్త స్టేట్మెంట్లతో పాక్ క్రికెట్ పరువు దిగజార్చొద్దని కోరుతున్నా. పొరుగు దేశాల్లో ఇలా జరగడం చూశారా? సునీల్ గవాస్కర్ ఎప్పుడైనా రాహుల్ ద్రవిడ్ను విమర్శించాడా?’ అని రమీజ్ రాజా పేర్కొన్నారు. పాకిస్థాన్లోనే ఇలా జరుగుతుందన్నాడు.
ప్లేయర్లు తమ విధులను సరిగ్గా చేయకుండా మాజీ క్రికెటర్లు అడ్డుపుల్లలు వేస్తుంటారని చెప్పుకొచ్చాడు రమీజ్ రాజా. పీసీబీ ఛైర్మన్ కావాలంటే ముందు గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలని.. అప్పుడే పోటీ చేసేందుకు అర్హత ఉంటుందని తెలుసుకోవాలంటూ మాజీ క్రికెటర్లకు రమీజ్ చురకలంటించాడు. కాగా, ఇటీవల మీడియా సమావేశంలో విలేకర్లపై బాబర్ ఆజమ్ అసహనం వ్యక్తం చేశాడు. దీన్ని దృష్టిలో ఉంచుకునే అక్తర్ ఈ విధంగా విమర్శలు చేశాడంటున్నారు. అయితే, సొంత దేశ ప్లేయర్, అందునా జట్టు సారథిని ఇలా ఇంగ్లీష్ రాదంటూ పరువు తీయడం సరికాదని మాజీలు సహా క్రికెట్ ఫ్యాన్స్ అక్తర్పై మండిపడుతున్నారు.