వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఓడినప్పటికీ వన్డే వరల్డ్ కప్ మనదే అంటున్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. డిఫరెంట్ గేమ్ స్ట్రాటజీతో ప్రపంచ కప్కు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..!
భారత జట్టు మరోమారు ఘోరంగా ఫెయిలైంది. కోట్లాది మంది ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకుంటే చెత్తాటతో వారిని పూర్తిగా నిరాశపర్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 209 రన్స్ తేడాతో ఓటమితో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఆసీస్కు కనీసం పోటీ ఇవ్వనందుకు మన ప్లేయర్లపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో భారత టీమ్ను నెటిజన్స్ ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. కంగారూలతో కీలకమైన మ్యాచ్లో టీమ్ సెలెక్షన్ దగ్గర నుంచి షాట్ సెలెక్షన్ వరకు టీమిండియా చేసిన తప్పులను, లోపాలను ఎత్తిచూపుతున్నారు. జట్టు సారథి రోహిత్ శర్మ పైనా భారత ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాక రోహిత్కు పెద్దగా ఏదీ కలసి రావడం లేదు. 2022 టీ20 ప్రపంచ కప్, ఆసియా కప్-2022తో పాటు తాజాగా డబ్ల్యూటీసీ-2023లోనూ భారత్ను ఛాంపియన్గా నిలపడంలో ఫెయిల్ అయ్యాడు హిట్మ్యాన్.
ఐసీసీ టోర్నీల్లో వరుసగా విఫలమవుతున్న రోహిత్ కెప్టెన్గా పనికిరాడని.. వెంటనే అతడ్ని సారథిగా తొలగించాలంటూ నెట్టింట ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విమర్శలను రోహిత్ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే వన్డే ప్రపంచ కప్పై తన దృష్టిని సారించాడు. స్వదేశంలో జరిగే మెగాటోర్నీలో భారత్దే విజయమని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు. ‘అక్టోబర్లో ఇండియా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఆ టోర్నీలో విభిన్నమైన గేమ్ ప్లాన్తో రాణించేందుకు ప్రయత్నిస్తాం. ఫ్యాన్స్ను అలరించేందుకు తప్పకుండా కృషి చేస్తాం. ఫలానా మ్యాచ్ అని కాకుండా.. ప్రతి మ్యాచ్లోనూ ఒకేరీతిలో ఆడేందుకు ప్రయత్నిస్తాం. మెగాటోర్నీలో మా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తాం. డిఫరెంట్గా ఆడి వన్డే ప్రపంచ కప్ను సొంతం చేసుకోవడం మీద దృష్టి పెడతాం’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.