కరోనా వల్ల లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ క్లాసులను నిర్వహించారు. స్కూళ్లు, కాలేజీలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం చూశాం. అయితే క్రికెట్లో ఆన్లైన్ కోచింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇంటర్నేషనల్ క్రికెట్లో తొలిసారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అలాంటి ప్రయత్నం చేస్తోంది. జట్టుకు కొత్త కోసం చూస్తున్న పాక్ క్రికెట్ బోర్డు.. గతంలో తమ టీమ్కు కోచ్గా సేవలందించిన మికీ ఆర్థర్ను మరోసారి తీసుకొస్తోంది. ఆయన్ను పాక్ జట్టు ఆన్లైన్ కోచ్గా నియమించింది. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల్లోనే ఆయన నేరుగా టీమ్ దగ్గరకు వస్తారని తెలుస్తోంది. ఈ నిర్ణయంపై పాక్ మాజీ సారథి మిస్బావుల్ హక్ సీరియస్ అయ్యాడు.
మికీ ఆర్థర్ను ఆన్లైన్ కోచ్గా నియమించడం పాకిస్థాన్ క్రికెట్కు సిగ్గుచేటని మిస్బావుల్ అన్నాడు. ఇది పాక్ క్రికెట్ వ్యవస్థకు చెంప పెట్టులాంటిదన్నాడు. ఒక మంచి కోచ్ను వెతకడంలో పీసీబీ విఫలమవుతోందని మిస్బా చెప్పాడు. బెస్ట్ కోచ్లు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపడం లేదని.. అందుకే పాకిస్థాన్ను సెకండ్ ఆప్షన్గా చూసే వారి వైపు పీసీబీ చూస్తోందన్నాడు. హై ప్రొఫైల్ ఉన్న ఫుల్టైమ్ కోచ్ దొరకడం లేదా అంటూ పాక్ బోర్డుపై మిస్బా ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ క్రికెట్లో ఒకర్నొకరు విమర్శించుకోవడం ఎక్కువైపోయిందని.. ఇది అభిమానులకు తప్పుడు సందేశాన్ని పంపిస్తోందని మిస్బా పేర్కొన్నాడు.