గత కొంత కాలంగా క్రీడారంగానికి చెందిన ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. తమ అభిమాన క్రీడాకారులు మృతి చెందడంతో శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
ఇటీవల సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖుల మరణాలతో వారి కుటుంబ సభ్యులే కాకుండా ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు తులసీదాస్ బలరామ్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
ఫుట్బాల్ క్రీడారంగంలో విషాదం చోటు చేసుకుంది.. ఆసియన్ గేమ్స్ విజేత, ఒలింపీయన్.. స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ తులసీదాస్ బలరామ్ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తులసీదాస్ బలరామ్ 1962 లో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించారు. సికింద్రాబాద్ కి చెందిన తులసీదాస్ భారత్ కి చెందిన దిగ్గజ ఫుల్ బాల్ ప్లేయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
గత కొంత కాలంగా తులసీదాస్ బలరామ్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. అప్పటి నుంచి ఆయన మంచానికే పరిమితమయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా కుటుంబ సభ్యులు ఆయనకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. 2021 లో ఓ సారి కిందపడిపోవడంతో తలకు బాగా గాయం అయ్యింది.. అప్పుడు ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేశారు. భారత్ లో దిగ్గజ ఫుట్ బాల్ త్రయంలో ఒకరైన తులసీదాస్ బలరామ్ కన్నుమూయడంతో పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా, ఇప్పటికే దిగ్గజ ఫుట్ బాల్ త్రయంలో చునీ గోస్వామి, పికే బెనర్జీ కన్నుమూశారు.