భారత్, ఇంగ్లాండ్ సిరీస్లో ఆఖరి టెస్టును బీసీసీఐ, ఈసీబీ మాట్లాడుకుని మ్యాచ్ని నిలుపుదల చేశారు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయానికి వచ్చింది. టీమిండియా హెట్ కోచ్ సహా పలువురికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ను రద్దుకు అంగీకరించారు. ఐదు టెస్టుల సిరీస్లో నాలుగు మ్యాచ్లు జరిగాయి. వాటిలో మొదటిది డ్రాకాగా, రెండు భారత్, ఒక మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది. ఆఖరి టెస్టు డ్రా కావడం వల్ల సిరీస్ ఫలితాన్ని ఎటూ తేల్చకుండా ఉంచేశారు. దానిపై ఏకాభిప్రాయం కుదరక.. ఈసీబీ ఐసీసీని ఆశ్రయించింది. ఇప్పుడు ఆఖరి టెస్టు విజేతగా ఇంగ్లాండ్ను ప్రకటిస్తారనే పుకార్లు కూడా మొదలయ్యాయి.
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ నిబంధనల ప్రకారం కరోనా భయంతో టెస్టు మ్యాచ్ను రద్దు చేయవచ్చు. ఇప్పుడు అలా కరోనా కారణంగా మ్యాచ్ రద్దైందని ప్రకటిస్తే వారికి రావాల్సిన బీమా సొమ్ము రాదని ఈసీబీ బాధపడుతోంది. మాకు న్యాయం చేయండంటూ ఐసీసీకి లేఖ రాసింది ఈసీబీ. ఐదో టెస్టును పూర్తిగా రద్దు చేస్తే సిరీస్ నాలుగు టెస్టులకే పరిమితం అవుతుంది. అంటే 2-1 ఆధిక్యంతో సిరీస్ టీమిండియా సొంతం అవుతుంది. లేదు ఐదో టెస్టును నిర్వహించాలని ఐసీసీ తెలిపి.. అందుకు టీమిండియా ఒప్పుకోకపోతే అప్పుడు ఇంగ్లాండ్కు ఫేవర్గా ఫలితం ఇస్తారు. అప్పుడు 2-2తో సిరీస్ డ్రామా ముగుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంగ్లాండ్ టెస్టు ఆడేందుకు సిద్ధంగా ఉన్నా.. భారత్ అందుకు ఒప్పుకోకపోతే కచ్చితంగా ఇంగ్లాండ్నే విజేతగా ప్రకటిస్తారు.
ఐపీఎల్ని వంకచూపి బీసీసీఐ, టీమిండియాపై ఈసీబీ, ఇంగ్లాండ్ మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఐపీఎల్ అంటేనే ఎక్కువ ప్రాధాన్యత అని టెస్టు మ్యాచ్ అంటే లెక్కలేదంటూ నోరు పారేసుకుంటున్నారు. బీసీసీఐ చర్యతో తమకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. గంగూలీ సెప్టెంబర్ 22న ఇంగ్లాండ్కు వెళ్తున్నాడు. అంతా సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది పొట్టి క్రికెట్ సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లాండ్ వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలోనే ఐదో టెస్టు మ్యాచ్ను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కరోనా వ్యాపించింది అంటూ ఈసీబీ ఆరోపిస్తోంది. తమ అనుమతి కోరకుండానే లండన్ హోటల్లో రవిశాస్త్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగిందని విమర్శిస్తోంది. ఆ కార్యక్రమంలో కోహ్లీ సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు. ముందు రవిశాస్త్రితో మొదలై కోచ్లు, సహాయకుల వరకు కరోనా వ్యాపించింది. ఇదే కారణాన్ని ప్రధానంగా చూపించి టెస్టు విజేతగా ప్రకటించాలని కోరచ్చు. అలా జరిగితే 2-2తో సిరీస్ సమమవుతుంది. ఇప్పుడు అంతా ఐసీసీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది.