ఆస్ట్రేలియా మహిళ క్రికెట్ జట్టుతో వన్డే సిరీస్లో ఇండియా మహిళల జట్టు రికార్డులు బద్దలుకొట్టింది. 264 భారీ లక్ష్యాన్ని ఛేదించింది. భారత్కు ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. అలాగే 2017 నుంచి వరుసగా 26 వన్డేల్లో గెలుస్తూ వస్తున్న ఆసీస్ జోరుకు కళ్లెం వేసింది. యువ బ్యాటర్లు యస్తిక భాటియా(64: 69 బంతుల్లో 9 ఫోర్లు), షెఫాలీ వర్మ(56: 91 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించడంతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 2 వికెట్ల తేడాతో ఆసీస్పై విజయం సాధించింది. ఆష్లీ గార్డ్నర్(67), బెత్ మూనీ(52), తహిలా మెక్గ్రాత్(47) పరుగులతో రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 9 కోల్పోయి 264 పరుగులు చేసింది.
37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన జులన్ గోస్వామికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. యస్తిక, షెఫాలీతో పాటు దీప్తి శర్మ(31), స్నేహ్ రైనా(30) పరుగులతో రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 49.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత మహిళల జట్టుకు వన్డేల్లో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. ఈ ఫలితంతో 26 వన్డేల పాటు ఓటమి లేకుండా సాగిన ఆస్ట్రేలియా జోరుకు బ్రేక్ పడింది. రెండు వన్డేల్లో నెగ్గిన ఆ జట్టు 2-1తో సిరీస్ను గెలిచింది. కాగా ఈ రెండు జట్ల మధ్య ఏకైక టెస్టు 30న ప్రారంభం అవుతుంది.