క్రికెట్ ప్రపంచంలో శ్రీలంకకు ఒక గొప్ప స్థానం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడంటే జట్టులో సీనియర్లు, సరైన ఆటగాళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు గానీ.. గతంలో శ్రీలంకతో మ్యాచ్ అంటే ఏ టీమ్ అయినా వణికిపోవాల్సిందే. అన్ని జట్లను ఆస్ట్రేలియా ఓడించుకుంటూ పోతుంటే.. అలాంటి ఆస్ట్రేలియా జట్టును శ్రీలంక మాత్రమే ఓడిస్తూ ఉండేది. అలాంటి శ్రీలంక జట్టుతో టీమిండియా ఒక చేదు అనుభవం ఉంది. అది కూడా అలాంటి ఇలాంటి మ్యాచ్ కాదు. ఆ రోజులు గుర్తుచేస్తే ఇప్పటి మాజీలు ఉలిక్కిపడే పరిస్థితి అది. టెస్టు మ్యాచ్లో 400 పరుగులు చేస్తేనే గగనం అనుకునే రోజుల్లో.. శ్రీలంక ఏకంగా 952 పరుగులు చేసింది. భారత్కు రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. చివరికి ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంత స్కోర్ చేసి ఎందుకు బ్యాటింగ్ ఇవ్వలేదనే అనుమానం రావచ్చు.. అలా ఎందుకు చేశారో కూడా పరిశీలిద్దాం.
ఆగస్టు 2వ తేదీ కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య టెస్టు మ్యాచ్. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 36 పరుగుల వద్ద నయన్ మోయింగా(7) పుష్పకుమార బౌలింగ్లో క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేరాడు. అంత త్వరగా వికెట్ కోల్పోవడంతో టీమ్లో కాస్త అనిశ్చితి నెలకొంది. కానీ.. రాహుల్ ద్రవిడ్తో కలిసి నవజోత్ సిద్ధు ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్లాడు. సిద్ధూ 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేశాడు. 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్ 183 వద్ద నవజోత్ సిద్ధూ వికెట్ని కోల్పోయింది. ఈ గేమ్లో రాహుల్ ద్రవిడ్(69) మంచి ప్రదర్శనే చేశాడు. సచిన్ టెండుల్కర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో అందరినీ అలరించాడు. 20 ఫోర్ల సాయంతో సచిన్ మొత్తం 143 పరుగులు నమోదు చేశాడు. మురళీధరన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్గా సచిన్ పెవిలియన్ చేరాడు.
తర్వాత జట్టు పరిస్థితి అయిపోయిందని శ్రీలంక భావిస్తున్న సమయంలో మహ్మద్ అజహరుద్దీన్ అద్భుతంగా రాణించాడు. 11 ఫోర్ల సాయంతో 126 పరుగులు చేశాడు. మురళీధరన్ బౌలింగ్లో అతనే క్యాచ్ పట్టుకుని అహజరుద్దీన్ అవుట్ చేశాడు. సౌరవ్ గంగూలీ ఈ మ్యాచ్లో డకౌట్ కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అనిల్ కుంబ్లే(27*) పోరాడేందుకు ప్రయత్నించాడు. కానీ, అతనికి సరైన సపోర్ట్ దొరకలేదు. రాజేశ్ చౌహాన్(23), అబే కురువిల్లా(9) తమవంతు ప్రయత్నం చేశారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో మొత్తం 167.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 537 పరుగుల వద్ద మ్యాచ్ని డిక్లేర్ చేసింది.
రెండోరోజు భారత్ డిక్లేర్ చేసిన తర్వాత.. శ్రీలంక ఆట ప్రారంభించింది. అయితే రెండో రోజు ఆట ముగిసే సరికి 39 పరుగుల వద్ద మర్వన్ ఆటపట్టు(26) కులకర్ణి బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత టీమిండియా ఆటగాళ్లు మేమిచ్చిన ఈ లక్ష్యాన్ని ఛేదించాలంటే శ్రీలంకకు ఎన్ని రోజులు పడుతుందో అని వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయ. ఆ తర్వాతి రోజు నుంచి శ్రీలంక తమ ఆటను మొదలు పెట్టాయి. అప్పుడప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న జయసూర్య, జయవర్దనే, రోషన్ మహనమ, అప్పటికే తామేంటో నిరూపించుకున్న అర్జున రణతుంగ, డి సిల్వ ఆట స్వరూపాన్నే మార్చేశారు. సనత్ జయసూర్య- రోషన్ మహనమలు టీమిండియాని ముప్పు తిప్పలు పెట్టారు.
39 పరుగులకు ఒక వికెట్ కోల్పోయిన శ్రీలంక రెండో వికెట్ నష్టానికి 615 పరుగులు చేసింది. రోషన్ మహనమ 27 ఫోర్ల సాయంతో 225 పరుగులు చేశాడు. అదే స్కోర్ కు సనత్ జయసూర్యా కూడా అవుట్ అయ్యాడు. జయసూర్య 36 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 340 పరుగులు చేశాడు. అక్కడితో విధ్వంసం ఆగిపోయిందిలే అని టీమిండియా భావించింది. కానీ, ఇంకా ఆగలేదని కాస్త నిదానంగా తెలుసుకున్నారు. తర్వాత వచ్చి డి సిల్వ(126), అర్జున రణతుంగ(86), మహేళ జయవర్దనే(66), కలువితరణ(14*), చమిందా వాస్(11*) పరుగులు చేశారు. బౌలింగ్ విషయానికి వస్తే.. టీమిండియాలో ఏ బౌలర్ ని శ్రీలంక ఆటగాళ్లు వదల్లేదు.
రాజేశ్ చౌహాన్ 78 ఓవర్లు వేసి 276 పరుగులు ఇచ్చాడు. అనీల్ కుంబ్లే 72 ఓవర్లు వేసి 223 పరుగులు ఇచ్చాడు. నీలేశ్ కులకర్ణి 70 ఓవర్లలో 195 పరుగులు ఇచ్చాడు. ముగ్గురూ కేవలం ఒక్కో వికెట్ మాత్రమే తీయగలిగారు. సౌరవ్ గంగూలీ 9 ఓవర్లు బౌలింగ్ వేసి 53 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మొత్తం ఐదు రోజుల ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 952 పరుగులు చేశారు. మొత్తానికి టెస్టుల్లో 400 పరుగులు చేస్తేనే గగనం అనుకుంటున్న తరుణంలో టీమిండియా 537 పరుగులకు డిక్లేర్ చేస్తే.. శ్రీలంక 952 పరుగులు చేసింది. వాళ్లు టెస్టులో విజయం సాధించాలని ఆడినట్లు కనిపించలేదు.. టీమిండియా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వచ్చిన వార్తలకు సమాధానంగా ఆడినట్లు కనిపించింది. తర్వాత టీమిండియా- శ్రీలంకను ఎన్నిసార్లు ఓడించినా.. ఈ ఒక్క మ్యాచ్ మాత్రం భారత్కు పీడకలలాకే ఉండిపోయింది.