వైజాగ్ లో పుట్టి పెరిగిన సెక్యూరిటీ గార్డు కూతురు గోల్డ్ మెడల్ సాధించే స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఆర్థిక పరిస్థితులు సహకరించవు, పరిస్థితులు అనుకూలించవు. అయినప్పటికీ అవాంతరాలను దాటుకుని ఆమె ఈ స్థాయికి వచ్చారు. ఆమె నేపథ్యం ఏంటి? ఆమె లక్ష్యం ఏంటి?
బ్యాంకాక్ లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో విశాఖ వాసి జ్యోతి యర్రాజీ పాల్గొన్నారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేసులో గోల్డ్ మెడల్ సాధించారు. 50 ఏళ్ల ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్ రేసులో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్ గా జ్యోతి యర్రాజీ నిలిచారు. జాతీయ స్థాయిలో 12.82 సెకన్లలో 100 మీటర్ల హర్డిల్స్ రేసుని పూర్తి చేసిన జ్యోతి యర్రాజీ.. ఇదే 100 మీటర్ల హర్డిల్స్ రేసుని అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ లో 13.09 సెకన్లలో పూర్తి చేశారు. దీంతో జపాన్ కి చెందిన టెరాడా అసుకా (13.13 సెకన్లు), అయోకి మసుమి (13.26 సెకన్లు) లపై విజయాన్ని సాధించారు. దీంతో జ్యోతి యర్రాజీ బుడాపెస్ట్ లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే అర్హతను సంపాదించుకున్నారు.
ఈమెకు ఈ విజయం అంత సులువుగా రాలేదు. ఈమె ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడ్డారు. ఈమె ఒక సాధారణ సెక్యూరిటీ గార్డు కూతురు. ఒక సెక్యూరిటీ గార్డు కూతురు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఈమె తల్లి కుమారి గృహిణి. తండ్రి సూర్యనారాయణ ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డుగా పని చేస్తున్నారు. వీరు విశాఖపట్నంలోని కైలాసపురంలో నివాసముంటున్నారు. విశాఖపట్నంలో డాక్ లేబర్ బోర్డు స్కూల్లో పదో తరగతి వరకూ చదువుకున్న జ్యోతి.. 2015లో ఏపీ అంతర్ జిల్లాల మీట్ లో బంగారు పతాకాన్ని గెలుచుకున్నారు. మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్ శాయ్ సెంటర్ లో చేరిన జ్యోతి.. ఆ తర్వాత గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ లో చేరే ఛాన్స్ వచ్చింది.
కొన్ని రోజులకు అది మూతబడడంతో ఆమె వైజాగ్ వెనుతిరిగి వచ్చారు. అయితే విశాఖలో పూర్తి స్థాయి శిక్షణ కేంద్రాలు లేకపోవడం, ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఆమె ఆలోచనలో పడిపోయారు. నాలుగేళ్లు స్ట్రగుల్ తర్వాత అంటే 2019లో ఆమెకు రిలయన్స్ ఆధ్వర్యంలో ఒడిశాలోని భువనేశ్వర్ లో ఉన్న అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ కోచింగ్ తీసుకున్న ఆమె ఆ తర్వాత పాల్గొన్న పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. కర్ణాటకలో జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ మీట్ లో 13.03 సెకన్లతో ఒక స్వర్ణ పతకం.. 2020లో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో ఇంకో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. ఆ తరువాత ఏడాది కరోనా కారణంగా ఖాళీగా ఉదనాల్సి వచ్చింది.
2022లో భువనేశ్వర్ లో జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మీట్ తో మళ్ళీ జ్యోతి కెరీర్ ట్రాక్ ఎక్కింది. అదే ఏడాది గుజరాత్ లో జరిగిన జాతీయ పోటీల్లో 12.79 సెకన్లలో హర్డిల్స్ రేసుని పూర్తి చేశారు. 13 సెకన్ల కంటే తక్కువ టైంలో హర్డిల్స్ రేసుని పూర్తి చేసిన మొట్టమొదటి మహిళగా జ్యోతి రికార్డుల్లోకెక్కారు. ఇప్పుడు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేసులో స్వర్ణ పతకం సాధించారు. ఎలాగైనా ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొని పతకం గెలవాలన్న లక్ష్యంతో ఆమె ఉన్నారు. అందుకోసం ఆమె ఇప్పుడు జరగబోయే ఛాంపియన్ షిప్ లో 12.77 సెకన్లలో హర్డిల్స్ రేసుని ఫినిష్ చేయాలి. అలా చేస్తే ఆమె ప్యారిస్ ఒలింపిక్స్ లో అర్హత సాధిస్తారు. ఇప్పటి వరకూ ఆమె రికార్డ్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన 12.82 సెకన్లు. మరి ఆమె లక్ష్యం నెరవేరాలని.. భారత్ కు పతకాన్ని తీసుకురావాలని కోరుకుందాం.