దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈడెన్ గార్డెన్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరో రెండు నెలల్లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఇలా అగ్ని ప్రమాదం జరగడం బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది.
దేశంలో కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ ని ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో అతి పెద్ద గ్రౌండ్ లో ఒకటిగా భావించే ఈడెన్ గార్డెన్స్ ఎంతో మందికి ఫేవరేట్. ఎంతో విశాలంగా అన్ని సదుపాయాలు కలిగిన ఈ గ్రౌండ్ లో టీమిండియాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సారి వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఈ మైదానంలో కొన్ని కీలక మ్యాచులు జరగనున్నాయి. నవంబర్ 5 న రౌండ్ రాబిన్ లో భాగంగా కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో పటిష్టమైన దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. గ్రూప్ దశలో 4 మ్యాచులతో పాటుగా సెమి ఫైనల్ 2 కూడా ఇక్కడే జరగబోతుంది. ఇప్పటికే ఏర్పాట్లను చేస్తూ ఉండగా అనూహ్యంగా ఇప్పుడు ఈ మైదానంలో అగ్ని ప్రమాదం చోటు చోటు చేసుకోవడం ఇప్పుడు అభిమానులని కలవరపెడుతుంది.
ప్రస్తుతం వరల్డ్ కప్ మ్యాచుల కోసం ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ ని సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ 15 నాటికి మరమ్మతు పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో రెయింబవళ్లు ఈ మైదానంలో పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మరమ్మతు పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించడంతో అందరు షాక్ కి గురయ్యారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. బుధవారం రాత్రి డ్రెస్సింగ్ రూమ్ లో మంటలు చెలరేగడంతో సిబ్బంది వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైరింజన్లు ఆ ఘటన స్ధలానికి వచ్చి మంటలు ఆర్పేశాయి. అయితే అప్పటికే డ్రెస్సింగ్ రూమ్ లో మంటలు వ్యాపించినట్లుగా తెలిసింది. అయితే దీనికి కారణం ఏంటని పరిశీలిస్తే విద్యుత్ పరికరాల్లో సమస్య కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది.
ప్రమాదం జరిగినప్పటికీ అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మనట్లు చెలరేగిన వెంటనే సిబ్బంది అక్కడనుంచి అప్రమత్తమై అక్కడ నుంచి బయటికొచ్చారు. అయితే అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. సామాగ్రిని భద్రపరుచుకోవడానికి వాడే ఈ గదిలో కొంతమంది ఆటగాళ్ల సామాగ్రి ధ్వంసమైనట్టు తెలుస్తుంది. విషయం తెలిసిన వెంటనే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ జాయింట్ సెక్రటరీ దేబ్రత్ దాస్ మైదానానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ఆటగాళ్లకోసం ఇక్కడ మరోకొత్త డ్రసింగ్ రూమ్ నిర్మాణం కూడా శరవేగంగా కొనసాగుతుందని ఆయన వెల్లడించాడు. ఇక్కడ మ్యాచ్ జరగాలంటే అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి అని తెలియజేశాడు. మరో రెండు నెలల్లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఇలా అగ్ని ప్రమాదం జరగడం బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది.