ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం. ప్రపంచంలోని అద్భుతమైన క్రికెటర్స్.. తమ జట్టులో అంటే తమ జట్టులో ఉండాలని ప్రతి ఒక్క ఫ్రాంచైజీ కోరుకుంటుంది. అందులో భాగంగానే ఆటగాళ్లని సొంతం చేసుకునేందుకు కోట్లకు కోట్లు డబ్బు ఖర్చు పెడుతుంది. తాజాగా జరిగిన మినీ వేలంలోనూ 24 ఏళ్ల సామ్ కరన్ ని రూ.18.5 కోట్లు పెట్టి మరీ పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. స్టోక్స్ కోసం చెన్నై రూ.16.5 కోట్లు, హ్యారీ బ్రూక్ కోసం హైదరాబాద్ రూ.13.5 కోట్లు పెట్టింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ముగ్గురూ కూడా ఇంగ్లాండ్ ఆటగాళ్లే. ఒకప్పుడు టెస్టు క్రికెటర్లు అని ముద్రపడిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. ఇప్పుడు ఐపీఎల్ నే కాదు క్రికెట్ నే శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. అసలు అండర్ డాగ్స్ ఉన్న ఇంగ్లాండ్ జట్టు ఇలా మారడానికి రీజన్ ఏంటి? ఈ మార్పు ఎలా సాధ్యమైంది?
ఇక విషయానికొస్తే.. ఒకప్పుడు ఐపీఎల్ లో ఇంగ్లీష్ క్రికెటర్లు చాలా అంటే చాలా తక్కువగా కనిపించేవారు. ఉన్నాసరే వాళ్లని బెంచ్ పై కూర్చోబెట్టేవారు. లేదంటే ఏదో ఒకటి రెండు మ్యాచుల్లో ఆడించి మమా అనిపించేవారు. దానికి కారణం ఆ దేశ క్రికెటర్ల ఆటతీరు. క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ లోనే. అప్పుడెప్పుడో 1611లో ఈ గేమ్ ని సౌత్ ఇంగ్లాండ్ లో తొలిసారి ఆడారు. ఇక 18వ శతాబ్దానికి వచ్చేసరికి క్రికెట్ గుర్తింపు తెచ్చుకుంది. 19, 20 శతాబ్దాల్లో ఈ గేమ్ గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది. గేమ్ కనిపెట్టింది ఇంగ్లాండ్ అయినా, మిగతా దేశాలు క్రికెట్ లో దూసుకెళ్లిపోయాయి. తురుపు ముక్కల్లాంటి ఆటగాళ్లని రెడీ చేసుకుని ప్రపంచకప్ లు కూడా కొట్టేశాయి. ఇంగ్లాండ్ మాత్రం దశాబ్దాల పాటు లాస్ట్ బెంచ్ లోనే ఉండిపోయింది.
అదేంటి ఇంగ్లాండ్ గురించి ఇంత నెగిటివ్ గా చెబుతున్నావ్.. ఆ దేశ క్రికెటర్లు ఒకప్పుడూ కూడా బాగానే ఆడేవారు కదా అని మీకు డౌట్ రావొచ్చు. అవును మీరు ఊహించింది కరెక్టే. ఇంగ్లాండ్ జట్టు పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది టెస్టులే. క్రికెట్ లో చాలా ఫార్మాట్స్ వచ్చినా సరే ఈ గేమ్ కు అమ్మలాంటి టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు అదరగొట్టేది. ఈ ఫార్మాట్ లో ఇంగ్లీష్ జట్టుని కొట్టాలంటే అవతల జట్టుకు కచ్చితంగా రాసిపెట్టుండాలి. లేకపోతే అది అస్సలు జరిగేది కాదు. కుక్, బెల్, స్ట్రాస్, ట్రాట్, స్టీవర్ట్, కాలింగ్ వుడ్, మార్కస్ టెస్టోస్టిక్ లాంటి దుర్భేద్యమైన ఆటగాళ్లతో కౌరవసైన్యంలా కనిపించేది. కానీ మోడ్రన్ క్రికెట్ అనే యుద్ధంలో మాత్రం ఓడిపోయేది.
ఇక క్రికెట్ లో టీ20 మ్యాచ్ లు పెరిగిపోయినా తర్వాత టెస్టులకు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. అదే టైంలో ఇంగ్లాండ్ జట్టు ప్రాధాన్యం కూడా తగ్గినట్లు కాస్త కనిపించింది. అలాంటి టైంలో జట్టులోకి యువ రక్తం అంటే యంగ్ క్రికెటర్స్ వచ్చారు. మోర్గాన్, బట్లర్, హేల్స్, రాయ్ లాంటి ఆటగాళ్లు ఫాస్ట్ గేమ్ ని పరిచయం చేశారు. వీళ్లతోపాటు అలా జట్టులోకి వచ్చిన కుర్రాళ్లు.. మొత్తం ఇంగ్లాండ్ జట్టు రూపురేఖల్నే మార్చేశారు. 2015 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ మార్పు మొదలవగా.. 2019 వన్డే వరల్డ్ కప్ ని ఇంగ్లాండ్ గెలవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ప్రపంచస్థాయిలో ఆ జట్టు గెలిచిన మొట్టమొదటి ట్రోఫీ ఇదే కాబట్టి. ఆ టోర్నీలో జట్టు విజేతగా నిలవడంలో స్టోక్స్, ఆర్చర్ లాంటి ప్లేయర్స్ కీ రోల్ ప్లే చేశారు.
ఇక ఇంగ్లాండ్ జట్టుకు మోర్గాన్ కెప్టెన్ అయిన తర్వాత ఆటగాళ్లలో స్పీడ్ పెరిగింది. కుర్రాళ్లలో దూకుడు కనిపించింది. అప్పుడు మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2019లో వన్డే ప్రపంచకప్, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచారు. రాబోయే రోజుల్లో టెస్టు ఛాంపియన్ షిప్ కూడా గెలిచేస్తారు. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలోనూ రికార్డ్స్ అన్ని బద్ధలు కొట్టింది ఇంగ్లాండ్ ఆటగాళ్లే. సామ్ కరన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్స్ కోసం అన్ని ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. కోట్లకు కోట్లు కుమ్మరించాయి.
ఒక్కసారి గతానికి వెళ్తే.. ఏడేళ్ల క్రితం అంటే 2015లో కేవలం ముగ్గురు ఇంగ్లాండ్ క్రికెటర్లు.. మోర్గాన్, హేల్స్, రవి బొపారా మాత్రమే ఐపీఎల్ ఆడారు. అదే ఇప్పుడు ఏకంగా 15 మంది ఈ టోర్నీలో వివిధ జట్లలో టాప్ పొజిషన్స్ లో ఉన్నారు. సామ్ కరన్, స్టోక్స్, మొయిన్ అలీ, ఆర్చర్, బట్లర్, బెయిర్ స్టో లాంటిపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దాదాపు ప్రతి జట్టులోనూ ఉన్న ఇంగ్లాండ్ క్రికెటర్లు.. రాబోయే ఐపీఎల్ లో అద్భుతాలు చేస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఐపీఎల్ లో మాత్రమే కాదు రాబోయే రోజుల్లో క్రికెట్ లోనూ డామినేషన్ చూపించడం గ్యారంటీ అనిపిస్తోంది. అందుకే పెద్దలు అంటారు ఎవరినీ ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని! ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెటర్లని చూస్తుంటే అదే అనిపిస్తుంది. మరి ఇంగ్లాండ్ జట్టు, క్రికెటర్ల ఆటతీరులో మార్పుని మీలో ఎంతమంది గమనించారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
In 2015, only 3 England players played in the IPL.
15 English players in this year’s IPL is a reflection of how much England’s standing in white-ball cricket has changed.
— Tim Wigmore (@timwig) December 23, 2022