వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టుకు వింత సమస్యలు ఎదురవుతున్నాయి. వన్డే ప్రపంచకప్ సన్నాహకంగా పనికస్తుందనుకుంటే.. ఈ టూర్ తో కొత్త ప్రాబ్లమ్స్ వెలుగుచూస్తున్నాయి. తొలి టీ20లో ఇలాంటి ఒక చర్య వల్ల టీమ్ మేనేజ్ మెంట్ నవ్వుల పాలైంది.
ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గురువారం వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20లో భారత టీమ్ మేనేజ్మెంట్ పొరబాట్లు బయట పడ్డాయి. స్వల్ప లక్ష్యఛేదనలో మనవాళ్లు ఆకట్టుకోలేకపోగా.. చివరి వరుస బ్యాటర్లు క్రీజులోకి వచ్చే సమయంలో ఆ డొల్లతనం బయట పడింది. చివరి ఓవర్ లో భారత విజయానికి 6 బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. షెఫర్డ్ వేసిన అద్భుత యార్కర్ కు కుల్దీప్ వద్ద సమాదానం లేకపోయింది. అయితే ఈ సమయంలో 10వ స్థానంలో ముఖేశ్ కుమార్ బ్యాటింగ్ కు రావాల్సి ఉండగా.. అతడికి బదులు బ్యాట్ ప్యాడ్ లతో యుజ్వేంద్ర చాహల్ మైదానంలో అడుగు పెట్టాడు. సరాసరి బ్యాటింగ్ క్రీజు వద్దకు వెళ్తున్న చాహల్ ను ఎక్స్ ట్రా ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ వచ్చి అడ్డుకున్నాడు.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ రాహుల్ ద్రవిడ్ వారించడంతో చాహల్ ను తిరిగి డగౌట్ లోకి రావాల్సిందిగా ఉమ్రాన్ చెప్పాడు. దీంతో వేగంగా క్రీజులోకి వచ్చిన చాహల్ తిరిగి పరిగెత్తుకుంటూ.. డగౌట్ చేరాడు. ఆ సమయానికి ముఖేశ్ బ్యాట్ ప్యాడ్లతో సిద్ధంగ ఉండటంతో.. అతడు బ్యాటింగ్ కు వస్తాడని అంతా అనుకున్నారు కానీ.. అంపైర్లు కలగ చేసుకొని తిరిగి చాహల్ నే బ్యాటింగ్ కు రావాలని వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు ఔటైన అనంతరం మైదానంలోకి వచ్చిన ప్లేయరే.. బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా.. అతడిని తిరిగి వెనక్కి పిలిచి మరో ప్లేయర్ ను దింపడం నిబంధనలకు విరుద్దం. దీంతో చేసేదేం లేక చాహల్ బ్యాటింగ్ కొనసాగించాల్సి వచ్చింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం ఎవరి తర్వాత ఎవరు బ్యాటింగ్ కు దిగాలో కూడా నిర్ణయించుకోలేదా. ఇంత కన్ఫ్యూషన్ ఉంటే అంతర్జాతీయ మ్యాచ్ లు ఎలా నెగ్గుతారు అని పేర్కొంటున్నారు. మ్యాచ్ ను నిశితంగా పరిశీలించి తప్పొప్పులు చర్చించాల్సిన హెడ్ కోచ్ రాహుల్ నిద్ర పోతున్నాడా ఏంటి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. చాహల్ కు బదులు కాస్తొ ఒడ్డూ పొడుగు ఉన్న ముఖేశ్ క్రీజులోకి వచ్చి ఉంటే.. అడ్డి మారి గుడ్డిలో అయినా కొన్ని పరుగులు వచ్చి ఉండేవిగా అని వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ రాణించినా.. ఇతర ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలం కావడంతో తొటి టీ20లో భారత జట్టు 4 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే.
Yuzvendra Chahal walked out at No.10, but the Indian team wanted Mukesh Kumar. Chahal walked off and entered again as he took the field already#Yuzvendrachahal😂😂#INDvWI pic.twitter.com/8rWxh30ahh
— Md Nayab 786 🇮🇳 (@mdNayabsk45) August 3, 2023