ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇండియా– 2023లో భాగంగా 3 టెస్టులు, 3 వన్డేల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. టెస్టు సిరీస్ లో భాగంగా ఫిబ్రవరి 9, గురువారం నాగ్ పూర్ వేదికగా తొలి టెస్టులో తలపడనున్నాయి. ఎలాగైనా ఈ టెస్టు సిరీస్ నెగ్గి.. టీమిండియాపై పైచేయి సాధించాలని ఆస్ట్రేలియా పరితపిస్తోంది. అయితే ఈ టెస్టు సిరీస్ మొదలు కాకముందు నుంచే పిచ్చుల విషయంలో విమర్శలు, ప్రతివిమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆస్ట్రేలియా ఎప్పటిలాగానే సిరీస్ మొదలు కాకముందే తమ వ్యూహాలను అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. బీసీసీఐ స్పిన్ కు అనుకూలంగా పిచ్చులు రెడీ చేస్తోంది అంటూ పరోక్ష ఆరోపణలు కూడా చేస్తున్నారు. తాజాగా అదే ప్రశ్న కెప్టెన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా జర్నలిస్టుల నుంచి ఎదురైంది.
విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా గురువారం ఉదయం 9.30 గంటలకు టీమిండియా- ఆస్ట్రేలియా తొలి టెస్టు జరగనుంది. ఈ సిరీస్ కు సంబంధించి ఆస్ట్రేలియా నుంచి పిచ్ పై ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. బీసీసీఐ కావాలనే స్పిన్ కు అనుకూలంగా పిచ్ లు సిద్ధం చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. విదర్భలో ట్రైనింగ్ సెషన్ పూర్తి చేసుకుని ప్రెస్ బాక్సులోకి వెళ్లిన రోహిత్ శర్మకు ఈ ప్రశ్నే ఎదురైంది. ఆస్ట్రేలియాకి చెందిన కొందరు జర్నలిస్టులు రోహిత్ ను పిచ్ విషయంలో ప్రశ్నించారు. బీసీసీఐ స్పిన్ పిచ్ లు చేయిస్తోంది అన్న మాట వాస్తవమేనా? అని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు కెప్టెన్ రోహిత్ శర్మ సమాధానం చెప్పాడు.
“మీరు పిచ్ ల గురించి ఆలోచించడం మానేసి.. క్రికెట్ మీద దృష్టి పెట్టండి. నాగ్ పూర్ పిచ్ పై మరీ ఎక్కువ కంగారు పడొద్దు. పిచ్ ఎలా స్పందిస్తోంది? సీమ్ కు సహకరిస్తుందా? లేదా? ఇలాంటి ప్రశ్నలు మాని.. జస్ట్ వచ్చి మంచి క్రికెట్ ఆడండి. ఇరు జట్లలో ఉన్న 22 మంది టాలెంటెడ్ ప్లేయర్లే” అంటూ రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు. బీసీసీఐ వార్మప్ మ్యాచ్ లకు అవకాశం ఇచ్చినా ఆస్ట్రేలియా అంగీకరించలేదు. వార్మప్ కు పచ్చిక పిచ్ లు ఇచ్చి.. మ్యాచ్ కు మాత్రం స్పిన్ పిచ్ లు ఏర్పాటు చేస్తారంటూ ఆరోపించారు. 2004 నుంచి ఇప్పటివరకు భారత్ లో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నెగ్గలేదు. 2008 తర్వాత ఆస్ట్రేలియా ఇప్పుడే టెస్టు ఆడబోతోంది.