బంగ్లాదేశ్ క్రికెటర్లు అనగానే అందరిలో తక్కువ అంచనాలు, చిన్నచూపు ఉండేది. మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దంటూ బంగ్లాదేశ్ క్రికెటర్లు 2018 ఆసియాకప్ నుంచే అందరికీ సంకేతాలు పంపుతూనే ఉన్నారు. పాకిస్థాన్పై విజయం సాధించి ఆసియా కప్ ఫైనల్ చేరిన తీరు అందరినీ మంత్రిముగ్దులను చేసింది. ఆ సంయంలో బంగ్లాదేశ్ను పొగుడుతూ సెహ్వాగ్ చేసిన ట్వీట్ ఇప్పటికీ గుర్తుచేస్తున్నారు. ‘ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఎప్పుడూ అభిమానులు కోరుకున్నట్లే జరగదు’ అంటూ సెహ్వాగ్ అప్పుడే చెప్పాడు. పొట్టి క్రికెట్ ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ మరోసారి బంగ్లాదేశ్ హెచ్చరికలు పంపుతోంది.
అసలు విషయం ఏంటంటే బుధవారం న్యూజిల్యాండ్పై జరిగిన టీ20 మ్యాచ్లో ఎవరూ ఊహించని విధంగా 16.5 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌట్ చేసి అందరినీ ఔరా అనిపించింది. న్యూజిలాండ్ టీమ్లో కేవలం ఇద్దరు బ్యాట్స్మెన్లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారంటే వారి బౌలింగ్ ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేథం(18), నికోలస్(18) మినహా ఎవరూ 5 పరుగులు కూడా దాటలేకపోయారు. ముస్తాఫిజుర్కు 3 వికెట్లు, నసుం అహ్మద్, షకీబ్ అల్ హసన్, సైఫుద్దీన్లు తలో 2 వికెట్లు తీశారు. మహేది హసన్ ఒక వికెట్తో న్యూజిలాండ్ ఆటగాళ్లను బాగానే ఇబ్బంది పెట్టారు.
ఆగస్టులో ఢాకా వేదికగా ఆస్ట్రేలియాని 62 పరుగులకే ఆలౌట్ చేసినప్పుడు ఏదో గెలిచేశారు, దాంట్లో ఏముంది అన్నారు. కానీ, అలాంటి విజయమే ఇప్పుడూ నమోదైన నేపథ్యంలో బంగ్లాదేశ్ని నిజంగానే తక్కువ అంచనా వేయకూడదని టాక్ ప్రారంభమైంది.