టీమిండియా వెటరన్ క్రికెటర్ విజయ్ శంకర్ సెంచరీతో కదం తొక్కాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు సాధించి అదరగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్ 2022-23లో ఆడుతున్న విజయ్ శంకర్.. తమిళనాడు తరఫున బరిలోకి దిగాడు. పూణె వేదికగా మహారాష్ట్ర-తమిళనాడు మధ్య జరుగుతున్న మ్యాచ్లో శంకర్ వరుసగా రెండో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ కంటే ముందు ముంబైతో జరిగిన మ్యాచ్లోనూ విజయ్ శంకర్ సెంచరీ చేయడం విశేషం. ఈ మ్యాచ్లో 214 బంతుల్లో 10 ఫోర్లతో 107 పరుగులు చేశాడు. అయితే.. విజయ్ శంకర్ వరుస సెంచరీలు చేస్తుండటంతో మరోసారి టీమిండియా వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడు త్రీడీ ట్వీట్ వైరల్గా మారింది.
అంబడి రాయుడు, విజయ్ శంకర్ టీమిండియాలో చోటు కోసం పోటీ పడుతున్న సమయంలో అప్పటి టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అంబటి రాయుడు స్థానంలో విజయ్ శంకర్ను 2019 వన్డే వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశారు. ఈ నిర్ణయంపై యావత్ క్రికెట్ లోకం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేసినా.. ప్రసాద్ మాత్రం తన ఎంపికను సమర్ధించుకున్నారు. విజయ్ శంకర్ను త్రీ డైమెన్షన్ ప్లేయర్గా అభివర్ణిస్తూ.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో టీమిండియాకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాడని పేర్కొన్నాడు. అయితే.. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదని అంబటి రాయుడు ఎంతో ఆవేదన చెందాడు. తన బాధను ఒక ట్వీట్ రూపంలో వెల్లడించాడు.
2019 వన్డే వరల్డ్ కప్ చూసేందుకు త్రీడీ కళ్లజోడు ఆర్డర్ ఇచ్చినట్లు ట్వీట్ చేశాడు. విజయ్ శంకర్ను త్రీడీ ప్లేయర్గా ఎంఎస్కే ప్రసాద్ అభివర్ణించడంతో.. రాయుడు వ్యంగ్యంగా వరల్డ్ కప్ను త్రీడీ కళ్లజోడు పెట్టుకుని చూస్తానని.. తన అసహనాన్ని ఆ విధంగా వ్యక్త పరిచాడు. అయితే.. 2019 వన్డే ప్రపంచకప్లో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడిన విజయ్ శంకర్ గాయంతో టోర్నీ మధ్యలోనే ఇంటిదారి పట్టాడు. ఆడిన మూడు మ్యాచ్ల్లోనే శంకర్ విఫలం అయ్యాడు. దీంతో.. అప్పటి నుంచి విజయ్ శంకర్ను క్రికెట్ అభిమానులు ‘త్రీడీ’ ప్లేయర్ అంటూ పిలవడం మొదలుపెట్టారు. చాలా సార్లు త్రీడీ ప్లేయర్ అంటూ శంకర్ ట్రోలింగ్కు గురయ్యాడు. ఇప్పుడు వరుస సెంచరీలు చేస్తున్న క్రమంలోనూ.. త్రీడీ ప్లేయర్ అదరగొడుతున్నాడంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
HUNDRED!!! Consecutive centuries for Vijay Shankar @sportstarweb pic.twitter.com/yqWGaYxBy2
— S Dipak Ragav (@dipakragav) January 12, 2023