పోలీసులపై చేయి చేసుకున్న కేసులో అరెస్ట్ అయిన షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు.
వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మే 8 వరకూ రిమాండ్ కొనసాగనుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అనుమానాలు ఉన్నాయంటూ సిట్ అధికారులకు వివరించేందుకు సిట్ కార్యాలయానికి బయలుదేరిన షర్మిలను పోలీసులు లోటస్ పాండ్ లోని ఆమె నివాసం వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, షర్మిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో షర్మిల ఎస్సై మీద, మహిళా కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద షర్మిలపై, ఆమె కారు డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. ఏ1గా షర్మిలను, ఏ2గా కారు డ్రైవర్ బాలుని, ఏ3గా మరో డ్రైవర్ జాకబ్ ల పేర్లను చేర్చారు. షర్మిలపై 332, 353, 509, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటిలో రెండు బెయిలబుల్ కేసులు కాగా, మరో రెండు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన అనంతరం ఆమెకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో న్యాయమూర్తి ముందు తన వాదనలు వినిపించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలూ పని చేస్తారని.. అలాంటి వారిపై చేయి చేసుకోవడం వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. ప్రివెన్షన్ అరెస్ట్ కింద షర్మిల ఇంటికి వెళ్తే ఆమె పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని.. ఎస్సైపైన, మహిళా కానిస్టేబుల్ పైన చేయి కూడా చేసుకున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఆమెను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై తన కారును పోనిచ్చారని, ఓ కానిస్టేబుల్ కాలికి గాయమైందని అన్నారు. షర్మిలను రిమాండ్ కు అనుమతించాలని కోర్టును కోరారు.
మరోవైపు షర్మిల తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించారు. కనీసం వారెంట్ కూడా లేకుండా పోలీసులు అరెస్ట్ చేశారని.. షర్మిల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని.. ఆత్మరక్షణలో భాగంగానే ఆమె పోలీసులను తోశారని షర్మిల తరపు న్యాయవాది కోర్టులో వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ షర్మిలను పోలీసులు అనుమతించడం లేదని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. తొలుత తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం షర్మిలకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మే 8 వరకూ రిమాండ్ కొనసాగుతుందని కోర్టు వెల్లడించింది. కాగా షర్మిలకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్ ను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో పోలీసులు షర్మిలను చంచల్ గూడ జైలుకు తరలించారు. మరి షర్మిలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం, చంచల్ గూడ జైలుకు ఆమెను తరలించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.