టీడీపీ సీనియర్ నాయకుడు గుండెపోటుకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఏం చెప్పారంటే?
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ గుండెపోటుకు గురయ్యారు. ఉన్నట్టుండి ఆయన తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడ రమేష్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. యాంజియోగ్రామ్ టెస్ట్ చేసిన అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇదిలా ఉంటే బాబు రాజేంద్రప్రసాద్ అస్వస్థతకు గురయ్యారని తెలియగానే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు.
వైద్యులు ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. 1978లో ఫ్రెండ్స్ సర్కిల్ పేరుతో యూత్ సర్వీస్ సంస్థను ప్రారంభించిన బాబు రాజేంద్రప్రసాద్.. విద్యార్థి నాయకుడిగా ఎదిగి మెల్లగా రాజకీయాల్లోకి వచ్చారు. 1995లో స్వతంత్ర అభ్యర్థిగా ఉయ్యూరు నుంచి పోటీ చేసి సర్పంచ్ గా గెలిచారు. ఆ తర్వాత జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా చేశారు. 1996లో ఏపీ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2001లో ఉయ్యూరు జడ్పీటీసీగా గెలిచిన ఆయన 2002లో ఛాంబర్ ఆఫ్ ఏపీ స్టేట్ పంచాయతీరాజ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2006లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.