మాజీ మంత్రి ఈటెల రాజందర్ రాజీనామాతో హుజురాబాద్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇప్పటికే కొన్ని పార్టీలు గెలుపు గుర్రాలను ప్రకటించాయి. ఇక బీజేపీ నుంచి ఈటెల పోటీకి దిగుతుండటంతో తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించి హుజురాబాద్ రాజకీయాల్లో కాస్త హీట్ని పెంచింది. ఇక అన్ని పార్టీలు అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తుండటంతో కాంగ్రెస్ కూడా ఓ మంచి లీడర్ను వెతికే పనిలో నిమగ్నమైంది.
ఇక తాజా సమాచారం ప్రకారం హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండా సురేఖ పేరు బలంగా వినిపిస్తోంది. పార్టీ వర్గాల్లో కూడా సురేఖను కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టేందుకు మద్దతు తెలుపుతున్నారట. అయితే కొండా సురేఖ తెలంగాణ రాజకీయాల్లో ఓ బలమైన నేతగా వెలుగుతున్నారు. కాలంతో పాటు పరిస్థితులు మారుతున్న క్రమంలో రాజకీయాల్లో కాస్త గ్యాప్ ఇచ్చినా మళ్లీ ఇప్పుడిప్పుడే రంగంలోకి దిగుతున్నారు.
2009లో పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన సురేఖ రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కొండా సురేఖ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, బధిరుల సంక్షేమ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక అప్పట్లో వైఎస్ఆర్ కుటుంబంతో కొండా సురేఖకు విడదీయలేని బంధాన్ని ఏర్పరుచుకుని కాంగ్రెస్లో బలమైన నేతగా ఎదుగుతున్నారు. ఇక మరి ఇంతకు కాంగ్రెస్ అధిష్ఠానం హుజురాబాద్ అభ్యర్దిగా కొండా సురేఖ ఫైనల్ చేస్తారా..? లేక మరెవరి పేర్లనైన తెరమీదకు తెస్తారా అనేది తెలియాల్సి ఉంది.