ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవిపై ఈగ వాలకుండా చూసుకున్నారు. ఎవరైనా ఏమైనా అంటే వేంటనే వారికి ఘాటుగా బదులిచ్చేవారు. ఒకరకంగా చిరంజీవికి చెల్లెలుగా వ్యవహరించేవారు. అలాంటి ఆమె ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
సినీ పరిశ్రమలో రారాజుగా కొనసాగుతున్న సమయంలోనే చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ సమయంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిలో శోభారాణి ఒకరు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు శోభారాణి చాలా యాక్టివ్ గా ఉండేవారు. అంతకు ముందు టీడీపీలో ఉన్న ఈమె చిరంజీవి మీద అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పట్లో ఈమె పార్టీలో మహిళా విభాగమైన మహిళా రాజ్యం రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరించారు. అయితే చిరంజీవి రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేని కొన్ని శక్తులు ఆయన మీద దాడికి పాల్పడ్డాయి. ఎక్కడ తమ రాజకీయ ఉనికి ప్రశ్నార్థకమవుతుందో అని ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేశారు.
కోడి గుడ్లతో దాడి చేయించారు. వ్యక్తిగతంగా విమర్శించారు. కుటుంబ సభ్యులని అనరాని మాటలు అన్నారు. ఒకరకంగా చిరంజీవిని మానసిక క్షోభకు గురి చేశారు. ఆ సమయంలో విమర్శలకు సమాధానాలు చెబుతూ వచ్చారు శోభారాణి. చిరు మీద ఏ విమర్శ వచ్చినా, ఏ ఆరోపణ వచ్చినా శోభారాణి గట్టిగా బదులిచ్చేవారు. చిరంజీవి చెల్లెలు అన్న పేరు ఆమె తెచ్చుకున్నారు. అప్పట్లో రోజాకి, శోభారాణి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చిరుని సొంత అన్నలా భావించిన శోభారాణి.. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత మళ్ళీ టీడీపీలోకి వెళ్లిపోయారు. అలా అని ఆమె చిరంజీవికి వ్యతిరేకంగా లేరు. ఇప్పటికీ చిరంజీవి మీద అదే అభిమానాన్ని కొనసాగిస్తున్నారు.
అయితే ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఉన్నంత యాక్టివ్ గా ఇప్పుడు లేరు. ఆమె మళ్ళీ యాక్టివ్ గా కనబడితే చూడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జనసేన పార్టీ ప్రస్తుతం ఊపందుకుంది. కాబట్టి ఆమె జనసేన పార్టీలో చేరితే బాగుంటుందని జనసేన వర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేన పార్టీకి శోభారాణి అవసరం ఉందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో చిరంజీవి కోసం ఎలా అయితే నిలబడ్డారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం, పార్టీ కోసం నిలబడితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శోభారాణి లాంటి ఫైర్ బ్రాండ్ ఉండాల్సింది జనసేనలోనే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ ఊపందుకుంటున్న క్రమంలో మహిళా ఫైర్ బ్రాండ్ మహిళ ఉంటే పార్టీకి మరింత మైలేజ్ వస్తుందని భావిస్తున్న తరుణంలో శోభారాణి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. మరి ఈ విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.