పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపొందినప్పటికీ డిక్లరేషన్ ఇవ్వడంలో జాప్యం చేశారంటూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు. శనివారం రాత్రి 8 గంటలకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినా అర్ధరాత్రి 12 గంటల వరకూ ధ్రువీకరణ పత్రం అందించలేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్థసారథి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ తదితరులు జేఎన్టీయూ గేట్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. సంయుక్త కలెక్టర్ కేతన్ గార్గ్ కారును అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.
పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ నేతలను అరెస్ట్ చేసి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్థసారథి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పోలీసుల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. పోలీసులే ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుంటే ఇక ప్రజలను కాపాడేవారెవరని ప్రశ్నించారు.
ఎన్నికల నిబంధనలను అధికారులు ఉల్లఘించారని.. ఇప్పటికే దీనిపై ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశామని అన్నారు. స్టేషన్ వద్ద కూడా నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 1.30 వరకూ నేతలను పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. అయితే ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు ఈసీకి లేఖ రాశారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని లేఖ రాశారు. టీడీపీ అభ్యర్థి గెలిచినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించినా కూడా డిక్లరేషన్ ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.