వైఎస్ వివేకానంద హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జరీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ అవినాష్ రెడ్డిని సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అవినాష్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని ఆదేశించింది. అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. జనవరి 28న తొలిసారిగా విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి.. ఫిబ్రవరి 24న రెండోసారి విచారణకు హాజరయ్యారు. ఇవాళ సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈరోజు విచారణకు హాజరయ్యారు.
సీబీఐ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి. 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టులో కోరారు. విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్ కు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని అవినాష్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటివరకూ సీబీఐ అరెస్ట్ చేయలేదని, దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదని అవినాష్ రెడ్డి కోర్టుకు గుర్తు చేశారు.
తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అవినాష్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో తనను అరెస్ట్ చేయకూడదని కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు. తనపై సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు అవినాష్ రెడ్డికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ సోమవారం వరకూ అరెస్ట్ చేయకూడదని, అవినాష్ పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని సీబీఐని ఆదేశించింది. మరి తెలంగాణ హైకోర్టు ఈ విధమైన ఆదేశాలు జారీ చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.