అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతోంది. రాజ ద్రోహం నేరం కింద ఆయనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తరువాత విషయం సుప్రీం కోర్టుకు వెళ్లడంతో ఆయనను ప్రస్తుతం సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో రఘురామ కృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ నివేధికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు అధికారులు. దీంతో ఇప్పుడు తనను పోలీసులు కొట్టారన్న రఘురామ కృష్ణరాజు ఆరోపణలు, ఆయన బెయిల్ పై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటువంటి సమయంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ రఘురామ కృష్ణరాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్బంగా జోగి రమేశ్ రఘరామపై విమర్శలు గుప్పించారు. వైసీపీ పార్టీ గుర్తు, తమ పార్టీ నాయకుడు జగన్ ఫోటోతో రఘురామ కృష్ణరాజు ఎంపీగా గెలిచారన్న జోగి రమేశ్, ఆయన రాజీనామా చేస్తే కనీసం వార్డు మేంబర్ గా కూడా గెలవలేడని అన్నారు. ఐతే వేరే సభలో సభ్యుడి గురించి ఈ అసెంబ్లీలో విమర్శించడం తప్పు అని వ్యాఖ్యానించిన జోగి రమేష్, తాను మాట్లాడిన దాంట్లో తప్పుంటే ఆ మాటలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోగి రమేశ్ ను మెచ్చుకున్నారు. జోగి రమేశ్ కు ధ్యాంక్స్ చెప్పాలని సీఎం అన్నారు.
జోగి రమేష్ బాధలో ఆప్యాయత కనిపించిందని జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను మాట్లాడిన మాటలను రికార్డ్ల నుంచి తొలగించాలని జోగి రమేశ్ స్పీకర్ను కొరడంపై సీఎం అభినందించారు. మరో వైపు రఘురామ కృష్ణరాజు భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రాఘురామ కృష్ణరాజుపై ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని పిర్యాదు చేశారు. వారి పిర్యాదుపై స్పందించిన లోక్ సభ స్పీకర్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి నివేదిక తెప్పించి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.