విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ మంత్రులు రోజా, జోగి రమేష్, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ నాయకులకు చెందిన పలు కార్లు ధ్వంసమయ్యాయి. విశాఖ గర్జనను ముగించుకొని ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం ‘విశాఖ గర్జన’ పేరుతో వైసీపీ కార్యక్రమం. సాయంత్రానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన కార్యక్రమాలు. ఇలా ఒకే రోజు రెండు వేర్వేరు పార్టీలకు చెందిన ప్రోగ్రామ్స్ ఉండటంతో సాగరతీరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
‘విశాఖ గర్జన’ ముగించుకొని వైసీపీ నేతలు విశాఖ నుంచి తిరుగుపయనమవుతున్న సమయంలో ఎయిర్పోర్టులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారి కార్లపై దాడికి యత్నించారు. ఈ దాడిలో మంత్రిజోగి రమేష్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లు ధ్వంసమైనట్లు సమాచారం. విశాక గర్జన పేరుతో వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కార్యక్రమానికి జనం భారీగా తరలి వచ్చారు. వర్షం పడుతున్నా సరే లెక్కచేయకుండా జనం విచ్చేయడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. మంత్రులు, వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అదేస్థాయిలో వచ్చి కార్యక్రమాన్ని విజయంవంతం చేశారు. వికేంద్రీకరణకు అనుకూలంగా మాట్లాడుతూనే టీడీపీ, జనసేన, చంద్రబాబు, అమరావతి రైతులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాళ్లందర్నీ ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనీయొద్దని పిలుపు ఇచ్చారు.