స్పోర్స్ట్ డెస్క్- ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు ప్రారంభం కావాల్సిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కరిసిన వాన కనీసం టాస్ వేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇంగ్లాండ్ లోని సౌథాంప్టన్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి డబ్లూటీసీ మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉండగా, ఒంటి గంట నుంచే భారీ వర్షం మొదలైంది. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు తర్వాత వర్షం కొంత తగ్గుముఖం పట్టినా, ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో తొలి రోజు ఆటని అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ లో జూన్ నెలలో సహజంగానే ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతూ ఉంటుంది. అందుకనే డబ్లూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రిజర్వ్ డేని కేటాయించింది. అనుకోని వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లో కోల్పోయిన మ్యాచ్ సమయాన్ని లెక్కించి ఆరో రోజు ఆడిస్తారు. కానీ మ్యాచ్ ఫలితం తేలే అవకాశం ఉందని ఐసీసీ భావిస్తేనే, ఈ రిజర్వ్ డేలో ఆటని ఆడిస్తారు. తాజాగా మొదటి రోజు మ్యాచ్ మొత్తం రద్దవ్వడంతో రిజర్వ్ డేలో మ్యాచ్ని నిర్వహించడం ఖాయమని చెప్పవచ్చు.
ఇక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ విజేతకి 11.67 కోట్ల రూపాయల ప్రైజ్మనీ దక్కనుంది. అలానే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ గదని కూడా గెలిచిన టీమ్కి అందించనున్నారు. ఇక ఈ మ్యాచ్ లో రన్నరప్గా నిలిచిన టీంకు 5.84 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. అనుకోని పరిస్థితుల్లో మ్యాచ్ డ్రా అయితే ఈ మొత్తం ప్రైజ్మనీని భారత్, న్యూజిలాండ్ జట్లకు సమానంగా పంచుతారు. సౌథాంప్టన్ లో వర్షాల కారణంగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ మ్యాచ్ సజావుగా జరగడం అనుమానమే అని విశ్లేషకులు అంటున్నారు.