కరోనా కల్లోల కాలంలో ఎవరిని కదిలించినా కష్టాలే వినిపిస్తున్నాయి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, నలిగిపోయిన జీవితాలు ఎన్నో. ఇంకొందరైతే ఆప్తులను కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు. కానీ.., ఇన్ని విషాద ఘటనల నడుమ కూడా కొన్ని విచిత్ర సంఘటనలు అందరిని ఆశర్యపరుస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో ఇలాంటి వింత ఘటనే చోటుచేసుకుంది. జగయ్య పేటలో ముత్యాల గిరిజమ్మ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈమె భర్త గడ్డయ్య కొలిమి పని చేసేవాడు. ఇతను కాస్త మానసిక రోగి. వీరికి ఓ కుమారుడు కూడా. కష్టాన్ని నమ్ముకున్న కుటుంబం వీరిది. ఉన్నంతలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవిస్తూ వస్తున్నారు. కానీ.., కరోనా వీరితో విచిత్రమైన ఆట ఆడుకుంది. గత నెల 12న గిరిజమ్మ కరోనాతో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. మూడు రోజులు కాగానే మే 15న గిరిజమ్మ చనిపోయిందని విజయవాడ ఆస్పత్రి సిబ్బంది ఓ మృతదేహాన్ని ప్యాక్ చేసి భర్త గడ్డయ్యకు అప్పగించారు. కరోనా కరోనా కారణంగా బంధువులు ఆమె మృతదేహం వద్దకు వెళ్లే సాహసం చేయలేకపోయారు. దీంతో.., ఆ భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత మే 23న కుమారుడు కూడా చనిపోవడంతో తల్లి, కొడుకుకి కలిపి పెద్దకర్మ కూడా జరిపించారు గడ్డయ్య.
కొడుకు, చనిపోయి, భార్య చనిపోయి, ఎలాంటి తోడు లేక గడ్డయ్య కుప్పకూలిపోయాడు. పైగా.., అతను మానసిక రోగి. దీంతో.., అంతా గడ్డయ్య కష్టాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. కానీ.., అందరినీ ఆశ్చర్యపరుస్తూ.., ఈ బుధవారం గిరిజమ్మ నిక్షేపంగా ఇంటికి చేరింది. దీంతో.., గిరిజమ్మని చూసి ఊరి ప్రజలు అంతా బిత్తరపోయారు. చనిపోయింది అనుకున్న గిరిజమ్మ తిరిగి రావడంతో అంతా పరుగులు తీశారు. కానీ.., గిరిజమ్మ తరువాత జరిగింది చెప్పింది. నా ఆరోగ్యం బాగలేక నన్ను జిల్లా హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ఆస్పత్రి సిబ్బంది తనను బాగా చూసుకున్నారు. ఇప్పుడు తాను పూర్తిగా కోలుకున్నానని, సిబ్బందే తనను జగ్గయ్యపేటకు ఆటోలో పంపారని గిరిజమ్మ వివరించింది. దీంతో.., తమకి అప్పగించింది వేరే డెడ్ బాడీ అని గిరిజమ్మ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.., గిరిజమ్మ ఇంకా బలహీనంగా ఉండటంతో కుమారుని మరణ వార్తను ఆమెకు చెప్పలేదు. అయితే.., గిరిజమ్మ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేసిన మృతదేహం ఎవరిది అన్నది ఇప్పుడు అధికారులకు పెద్ద సమస్యగా మారింది. దీంతో.., ఏపీలో కరోనా రోగుల పట్ల వైద్య సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఇంత దారుణంగా ఉంది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.