నేషనల్ డెస్క్- సుమారు యేడాదిన్నర నుంచి కరోనా మహమ్మారి మానవాళిని పట్టి పీడిస్తోంది. కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనాతో అంచా నానా తంటాలు పడుతోంటే.. అది చాలదన్నట్లు బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. కరోనా కంటే వేగంగా బ్లాక్ ఫంగస్ విజృంబిస్తోంది. అది కూడా మన భారత్ లోనే ఎక్కువ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. బ్లాక్ ఫంగస్ ను అంటు వ్యాధిగా గుర్తించి చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు చూసించింది. దీంతో ఇప్పుడు బ్లాక ఫంగస్ పేరు చెబితేనే అంతా వణికిపోతున్నారు. కరోనా, బ్లాక్ ఫంగస్ తో నరకయాతన అనుభవిస్తోంటే.. తాజాగా మరో వైరస్ దండయాత్ర ప్రారంభించింది. దాని పేరే వైట్ ఫంగస్. బ్లాక్ ఫంగస్ కన్నా వైట్ ఫంగస్ మరింత ప్రాణాంతకమైందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్ ఫంగస్ కన్నా వైట్ ఫంగస్ చాలా వేగంగా శరీరాన్ని ప్రభావితం చేసే ప్రమాదకారి అని అంటున్నారు. వైట్ ఫంగస్ సోకినవారి ఊపిరితిత్తులు, గోళ్లు, చర్మం, కడుపు, మూత్రపిండాలు, మెదడు, మర్మావయవాలు, నోరు తీవ్రంగా ప్రభావితమవుతాయని వైద్యులు గుర్తించారు. వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ప్రభావం ప్రధానంగా మనిషి శరీరంలోని ఊపిరితిత్తులపై ఉంటుందట. దీనిని హెచ్ఆర్సీటీ పరీక్ష ద్వారా మాత్రమే కనుగొనవచ్చని వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు హెచ్ఆర్సీటీలో కనిపిస్తే, వైట్ ఫంగస్ను కనుగొనడానికి మ్యూకస్ కల్చర్ను ప్రత్యేకంగా ఎగ్జామిన్ చేయాలని నిపుణులు స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే భారత్ లో వైట్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా బీహార్ లోని పాట్నాకు చెందిన నలుగురికి వైట్ ఫంగస్ సోకినట్లు గుర్తించారు. ఆ నలుగురిలో ఒకరు ప్రముఖ డాక్టర్ కూడా ఉన్నారు.
ఈ వివరాలను పీఎంసీహెచ్కు చెందిన మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఎస్ఎన్ సింగ్ తెలిపారు. ఈ నలుగురికి మొదట కరోనా వైరస్ వంటి లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. ఐతే కరోనా పరీక్షలు చేస్తే మాత్రం నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ నలుగురికి నిర్వహించిన అన్ని పరీక్షల్లోనూ కొవిడ్ నెగెటివ్ గానే తేలింది. ఐతే అనుమానం వచ్చిన వైద్యులు మరింత లోతుగా పరిశీలించినపుడు, వీరికి వైట్ ఫంగస్ సోకినట్లు తేలింది. వెంటనే ఈ నలుగురికి వైద్య చికిత్స అందించారు. వీరికి యాంటీ ఫంగల్ ఔషధాలను ఇవ్వడంతో ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఐతే వైట్ ఫంగస్ ను గుర్తించడమే పెద్ద సవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కాలం స్టెరాయిడ్లు తీసుకునేవారికి, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉన్నవారికి, షుగర్ వ్యాధి ఉన్నవారికి వైట్ ఫంగస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. వ్యాధి లక్షణాలను బట్టి త్వరితగతిన పరీక్షించి వైద్యం అందించాలని అంటున్నారు.