హెల్త్ డెస్క్- కరోనా మహమ్మారి ఎంత అల్లకల్లోలం సృష్టించిందో మనం చూశాం. ప్రపంచాన్ని పట్టి పీడించిన కొవిడ్ కాస్త తగ్గు ముఖం పడుతోంది. ఐతే మళ్లీ ధర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇప్పటి వరకు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో ఒక వ్యక్తికి ఒక వేరియంట్ మాత్రమే సోకింది. ఐతే దేశంలో తొలిసారిగా ఓ బాధితురాలికి ఒకేసారి రెండు వేరియంట్లు సోకిన ఘటన అసోంలో వెలుగు చూసింది.
అసోంలోని దిబ్రూగఢ్లోని ఓ వైద్యురాలికి అల్ఫా, డెల్టా రెండు వేరియంట్లు సోకినట్టు గుర్తించారు. ఆమె పూర్తిస్థాయి వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ, ఆల్ఫా, డెల్టా రకం వేరియంట్ కరోనా సోకిందని ఆర్ఎంఆర్సీ పేర్కొంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ కు చెందిన రీజనల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్ లో చేయించుకున్న పరీక్షల్లో ఆ వైద్యురాలికి రెండు వేరియంట్లు సోకినట్లు తేలింది.
ఆ వైద్యురాలికి స్వల్ప లక్షణాలే ఉండటంతో ఆసుపత్రిలో చేరకుండానే కోలుకుందని ఐసీఎంఆర్ తెలిపింది. కొవిడ్ రెండు వేరియంట్లు ఒకేసారి సోకిన ఘటనలను డబుల్ ఇన్ ఫెక్షన్ అంటారని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బిశ్వజ్యోతి బోర్కకోటీ తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి ఒక వేరియంట్ బారినపడ్డ రెండు మూడు రోజుల్లో కానీ, లేదా యాంటీబాడీలు ఉత్పత్తి కావడానికి ముందుగా కానీ ఇలా మరో వేరియంట్ కూడా సోకే అవకాశం ఉంటుందని, కానీ ఇది చాలా అరుదని బోర్కకోటీ చెప్పారు.
సదరు వైద్యురాలి భర్తకు కూడా కోవిడ్ సోకిందని, జన్యు పరీక్షల్లో ఆల్ఫా వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయ్యిందని విైద్యులు తెలిపారు. ఇటువంటి డబుల్ ఇన్ఫెక్షన్ కేసులు చాలా అరుదని ఢిల్లీలోని సీఎస్ఐఆర్ ఐజీఐబీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. ఐతే మొన్నామధ్య బెల్జియానికి చెందిన ఓ 90 ఏళ్ల వృద్ధురాలికి డబుల్ వేరియంట్ గుర్తించారు. అల్ఫా, బేటా ఒకేసారి సోకినట్టు నిర్ధారణ కాగా, ఆమె ఈ ఏడాది మార్చిలో మృతి చెందింది. కానీ మన దేశంలో ఇప్పటి వరకు డబల్ వేరియంట్ కేసు మొట్టమదటి సారి నమోదైందని వైద్యులు చెబుతున్నారు.