చూడచక్కని నాలుగు షాట్లతో లైమ్లైట్లోకి వచ్చాడు తెలుగు కుర్రాడు కేఎస్ భరత్. ముంబైతో నిన్న రాత్రి జరగిని మ్యాచ్లో రాహుల్ చాహర్ బౌలింగ్లో రెండు భారీ సిక్సులు బాది కెప్టెన్ కోహ్లీని సైతం ఇంప్రెస్ అయ్యేలా చేశాడు. ఆర్సీబీలో భరత్ తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే వికెట్ కీపర్గా మంచి మార్కులు కొట్టేసిన భరత్.. ముంబయి ఇండియన్స్తో ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. భరత్ (32: 24 బంతుల్లో 2×4, 2×6) హిట్టింగ్తో మ్యాచ్లో తనపై ఒత్తిడి తగ్గిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వయంగా చెప్పడం గమనార్హం.
మ్యాచ్లో రెండో ఓవర్లోనే ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (0) డకౌట్గా వెనుదిరగగా నం.3 స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన శ్రీకర్ భరత్కి తొలి బంతినే బుమ్రా గంటకి 140కిమీ వేగంతో గుడ్ లెంగ్త్ రూపంలో సంధించాడు. ఆ బంతిని మిడ్ వికెట్ దిశగా ఫుష్ చేసిన భరత్.. సింగిల్ రాబట్టాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 3వ ఓవర్ బౌలింగ్కి వచ్చిన బౌల్ట్ బౌలింగ్లో షార్ట్ బాల్ని థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి తరలించిన భరత్.. ఆ తర్వాత బుమ్రాకీ ఫోర్ కొట్టాడు. ఇక ఇన్నింగ్స్ 7, 9వ ఓవర్లో స్పిన్నర్ రాహుల్ చాహర్కి మిడ్ వికెట్ దిశగా అతను కొట్టిన సిక్సర్లు కోహ్లీని బాగా ఆకట్టుకున్నాయి. అయితే.. అదే క్రమంలో రాహుల్ చాహర్కే భరత్ వికెట్ సమర్పించుకున్నాడు.
మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. ఛేదనలో బెంగళూరు 18.1 ఓవర్లలో 111 పరుగులకి ఆలౌటైంది. మ్యాచ్ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. భరత్ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘‘ఇన్నింగ్స్ని నేను బాగా ఆరంభించాను. అయితే.. రెండో ఓవర్లోనే దేవదత్ పడిక్కల్ వికెట్ చేజారిన తర్వాత కాస్త కష్టంగా అనిపించింది. కానీ.. కేఎస్ భరత్ తన హిట్టింగ్తో నాపైన ఒత్తిడి లేకుండా చేశాడు. అలానే మ్యాక్స్వెల్ నమ్మశక్యంకాని ఇన్నింగ్స్ ఆడాడు’’ అని అన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన కేఎస్ భరత్ స్వస్థలం విశాఖపట్నం.