వర్జిన్ గెలాక్టిక్ తన తదుపరి అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన వార్తను అధికారికంగా ప్రకటించింది. ఈ స్పేస్ రేస్ జులై 11 న జరుగుతుందని తెలిపింది. నలుగురు పైలెట్లు – డేవ్ మెక్ కే , మైకేల్ మశుచి, సీజే స్టర్కో, కెల్లీ లాటిమర్ , చీఫ్ ఆస్ట్రోనాట్ శిక్షకులు బెథ్ మోజెస్, లీడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ కొలిన్ బెనెట్, శిరీష బండ్లలు వర్జిన్ గెలాక్టిక్ టెస్ట్‘ఫ్లైట్’లో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. రోదసి పర్యటనలపై అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ తో వర్జిన్ గెలాక్టిక్ చీఫ్ రిచర్డ్ బ్రాన్సన్ పోటీ పడుతున్నారు. అంతరిక్ష ప్రయాణానికి కాలంతో పరుగులు తీస్తున్నారు. ఓ తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా ఉండడం విశేషం. శిరీష అంతరిక్షంలోకి అడుగుపెడితే భారతదేశం నుండి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రెండవ మహిళగా రికార్డు సృష్టించనుంది. అంతే కాకుండా మొట్టమొదటి అచ్చ తెలుగు మహిళ కూడా ఈమె అవుతుంది.
ఇప్పటి వరకు అంతరిక్షంలోకి వెళ్లిన వారిలో భారతదేశానికి చెందిన రాకేష్ శర్మ పురుషులలో మొదటి వారు కాగా, మహిళలలో కల్పనా చావ్లా మొదటి సారి అంతరిక్షంలో అడుగుపెట్టడం జరిగింది. శిరీష ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఈమెను అభినందిస్తున్నారు. అలాగే స్పేస్ లోకి వెళ్లి సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.