హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల బాట పట్టబోతున్నారు. కేవలం ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌజ్ కు మాత్రమే పరిమితం అవుతారనే ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ.. ఇకపై నిరంతరం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు వరుసగా జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఈదేశాల మేరకు అధికారులు ఆయన జిల్లా పర్యటనల షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఈ నెల 19వ తేదీన వనపర్తి జిల్లాలో, 20వ తేదీన జనగామ జిల్లాల్లో కేసీఆర్ పర్యటిస్తారు. ఈ పర్యటనల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ముఖ్యమంత్రి. జిల్లాల్లో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు.
వనపర్తి, జనగామ జిల్లా పర్యటనలో భాగంగానే పక్కనే ఉండే నియోజకవర్గాల్లో కూడా సీఎం పర్యటించనున్నారు. ఇందులో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటనలో ఉమామహేశ్వర లిఫ్ట్, రిజర్వాయర్కు, వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నారు. 20వ తేదీన నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కలెక్టరేట్లను ప్రారంభించి, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఇక ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, కేడీసీసీబీ అధ్యక్షులు, రైతు బంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం నిర్వహించబోతున్నారు.
మరోవైపు ఈ నెల 18న దళిత బంధుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. దళిత బంధుతో పాటు ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రగతిభవన్ లో జరిగే ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పలు శాఖలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొంటారు. ఈ సమావేశంలో దళిత బంధు అమలుపైనే ప్రధానంగా సమీక్షించనున్నారు.