వేలూరు- ఈ మధ్య కాలంలో హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలే. అందులోను ప్రేమ ముసుగులో కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని కఠన చట్టాలు అమలు చేసినా అడవాళ్లపై దాడులు మాత్రం ఆగడం లేదు. ప్రేమించింన వారినే మట్టుపెడుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
తమిళనాడులోని వేలూరులో ప్రియురాలిని హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. వేలూరు వల్లలార్ ప్రాంతానికి చెందిన భారతిదాశన్, దీపలక్ష్మి దంపతుల కుమార్తె 16 ఏళ్ల సాధన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అక్కడికి సమీపంలోని కరుగంబత్తూరు మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన 22 ఏళ్ల రామ్ కుమార్ దినసరి కూలిగా పనిచేస్తున్నాడు.
రామ్కుమార్, సాధన ఇద్దరూ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ వ్యవహారం సాధన తల్లిదండ్రులకు తెలియడంతో ఖండించారు. దీంతో సాధన, రామ్ కుమార్ తో మాట్లాడటం లేదు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన ఇంటిలో సాధన మృతి చెంది ఉండగా, రామ్ కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉండటాన్ని భారతిదాశన్, దీపలక్ష్మి గుర్తించారు.
రామ్ కుమార్ గొంతు నులిమి హత్య చేసి అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సాధన తనతో మాట్లాడటం లేదని ఆగ్రహించిన రామ్ కుమార్ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి మృత దేహాలను ఆసుపత్రికి తరలించారు. కుమార్తె మృత దేహాన్ని చూసి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.