ఇంటర్నేషనల్ డెస్క్- అఫ్ఘనిస్తాన్ లో దారుణం చోటుచేసుకుంది. రాజధాని కాబూల్ విమానాశ్రయం దగ్గర ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మొత్తం 72 మంది చనిపోగా, 140 మంది గాయపడ్డారు. దీంతో కాబూల్ లో భయానకర పరిస్థితులు నెలకొన్నాయి. కాబూల్ ఎయిర్ పోర్ట్ పరిసరాలన్నీ రక్తం సిక్తం అయ్యాయి. ఎక్కడ చూసినా మృతదేహాలు, క్షతగాత్రులే కనిపించారు.
అఫ్ఘన్ రాజధాని కాబూల్ విమానాశ్రయం, దాని పరిసర ప్రాంతాల్లో భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అమెరికా హెచ్చరించిన కొన్ని గంటల్లో ఈ ఉగ్రదాడి జరిగింది. కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విదేశీ పౌరులే లక్ష్యంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. మొత్తం మూడు మానవబాంబు దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా మొత్తం 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 12 మంది అమెరికా సైనికులు ఉన్నారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అఫ్గన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక కాబూల్ లో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో మరో 140 మంది గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం కాబూల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న అమెరికా సైనికులను ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించారు. కాబూల్ విమానాశ్రయంలో ఎటుచూసినా రక్తపు ముద్దలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో భీతావాహ వాతావరణం కనిపించింది.
ఐఎస్ ఉగ్రవాదులు కాబూల్ విమానాశ్రయం, దాని పరిసరాల్లో గుమిగూడిన విదేశీయులే టార్గెట్గా పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా అంతకు ముందే హెచ్చరించాయి. ఎయిర్ పోర్ట్ కు కూడా వెళ్లొద్దని, ఆయా మార్గాల్లో కూడా కారు బాంబులతో ఐఎస్ ఉగ్రమూకలు విరుచుకుపడే ప్రమాదముందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. నిఘావర్గాల అంచనాలమేరకు ఐఎస్ ఉగ్రవాదులు గురువారం సాయంత్రం 5.11 సమయంలో విమానాశ్రయంలోని అబే గేటు వద్ద తొలి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
ఆ అతరువాత 30 నిమిషాలకు స్థానిక బొరాన్ హోటల్ నుంచి విమానాశ్రయానికి దారి తీసే ప్రదేశంలో మరో మానవబాంబు దాడి జరిగింది. మరి కాసేపటికి ఐఎస్ ఉగ్రవాదులు రోడ్డుపై అమర్చిన ఐఈడీతో తాలిబాన్ల వాహనం పేలింది. ఆ వెంటనే అబే గేటుకు సమీపంలో ఎయిర్పోర్టు గోడ వద్ద గుమిగూడిన అఫ్ఘాన్లే టార్గెట్గా మరో మానవబాంబు దాడి జరిగింది.
కారులో పేలుడు పదార్థాలతో వచ్చిన ముష్కరుడు తనను తాను పేల్చుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ దాడులు తమ పనే అని ఐఎస్ అధికారికంగా ప్రకటించింది. ముందు ముందు మరిన్ని దాడులు తప్పవని సైతం ఐఎస్ హెచ్చరించడం గమనార్హం.