కర్నూలు- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ల మధ్య రహస్య స్నేహ బంధం ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న జల వివాదం పెద్ద డ్రామా అని, ఇదందా ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆయన సంచల కామెంట్స్ చేశారు. కర్నూలులో జరిగిన బీజేపీ రాష్ట్ర నాయకులు సమావేశంలో సోమూ వీర్రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాయలసీమలో నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు.
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్,జగన్ ఇద్దరూ అర్ధరాత్రుళ్లు ఫోన్లో రహస్య మంతనాలు జరుపుతున్నారన్న వీర్రాజు, తెల్లారితే లేఖల పర్వం మొదలుపెడుతున్నారని ఆరోపించారు. 2019లో సీఎం జగన్ ప్రమాణ స్వీకారం రోజున, కృష్ణా నీటి విషయంలో ఎలాంటి వివాదాలు సృష్టించమని కేసీఆర్ చెప్పిన మాటలు మరచిపోయారా అని సోమూ వీర్రాజు ప్రశ్నించారు.
బచావత్ ట్రిబ్యునల్, కృష్ణా బోర్డు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉండగా, ఇరువురు సీఎంలు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లేఖలు రాస్తున్నారని సోము వీర్రాజు అడిగారు. భద్రాచలం సహా చర్ల, వాజేడు, దుమ్ముగూడెం మండలాలను కోల్పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిందని సోమూ వీర్రాజు అన్నారు. ఇక రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు మినహా ఇతర ప్రాజెక్టులే లేవా అని సీఎం జగన్ను ప్రశ్నించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఒంగోలులో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పట్టించుకోరా అని నిలదీశారు.