బెంగళూరు- రాజకీయ నాయకుల చర్యలు ఒక్కోసారి భలేగా ఉంటాయి. పొలిటికల్ లీడర్స్ కు జరిగే చిన్న చిన్న సంఘటనలు భలే నవ్వులు తెప్పిస్తాయి. ఇక అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు వాగ్వాదం చేసుకునే సందర్బాలే ఎక్కువగా చూస్తుంటాం. కానీ చాలా అరుదుగా ఇరు పక్షాలు కలిసి నవ్వుకునే సందర్బాలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. తాజాగా కర్ణాటక అసెంబ్లీలో ఇలాంటి సందర్బమే వచ్చింది.
గురువారం కర్ణాటాక అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంతేరి, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య శాసనసభలో మైసూర్ లో జరిగిన సామూహిత అత్యాచారంపై చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆయన పంచె చిన్నగా ఊడిపోబోయింది. సిద్దరామయ్య పక్కనే కూర్చున్న కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ విషయాన్ని గమనించారు. వెంటనే సిద్దరామయ్య దగ్గరకు వెళ్లి పంచే ఊడిపోతున్న విషయాన్ని ఆయన చెవిలో చెప్పారు.
దీంతో పంచె వైపు చూసుకున్న సిద్దరామయ్య, అయ్యో అలాగా అంటూ.. తన పంచె ఊడిపోతోందని, దాన్ని సరి చేసుకున్నాక ప్రసంగాన్ని కొనసాగిస్తానని అసెంబ్లీలో మైక్ లో చెప్పేశారు. ఇంకే ముంది ఒక్కసారిగా అసెంబ్లీలో ఉన్నవాళ్లంతా గట్టిగా నవ్వేశారు. మైసూర్లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపైన సిద్దరామయ్య సీరియస్గా మాట్లాడుతుండగా ఆయన పంచె ఉడటం ఏంటని సభలో ఉన్నవాళ్లు కామెంట్స్ కూడా చేశారు.
ఇక తీరిగ్గా తన పంచెను సరిచేసుకున్న సిద్దరామయ్య, తిరిగి మాట్లాడుతూ.. మొన్న కరోనా నుంచి కోలుకున్న తర్వాత తాను నాలుగైదు కిలోలు పెరిగానని, దీంతో తన పొట్ట పెరుగడంతో నిలబడి మాట్లాడుతున్నప్పుడు పంచె ఊడిపోబోయిందని చెప్పుకొచ్చారు. సిద్దరామయ్య అన్న మాటలకి పకా పకా నవ్విన అధికారపక్ష నేతలు, ఏమైనా సహాయం కావాలా అంటూ పరిహాసం ఆడారు. వెంటనే స్పందించిన సిద్దరామయ్య, అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి మీ సహాయం మేం అడగబోమని వ్యాఖ్యానించారు.