గుంటూరు రూరల్- తల్లి తన బిడ్డ ఏడిస్తేనే తట్టుకోలేదు. అలాంటిది ఆ పసిబిడ్డపై అత్యాచారం జరిగిందని తెలిస్తే ఎంత తల్లడిల్లిపోతుంది. గుంటూరు జిల్లాలో అదే జరిగింది. ఇంకా ఈ ప్రపంచాన్ని సరిగ్గా చూడని ఏడు నెలల పాసికందుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది.
హృదయవిదారకరమైన ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని బోదనంపాడులో జరిగింది. సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో 7నెలల పసికందును ఊయలలో నిద్రపుచ్చిన తల్లి పక్కనే పడుకుంది. ఐతే అంతా నిద్రపోయాక ఏంజరిగిందో తెలియదు కాని, తెల్లరి లేచి చూస్తే పాప కనిపించలేదు. దీంతో కన్నీరుమున్నీరైన ఆ తల్లి కుటుంబసభ్యులతో కలిసి పాప కోసం చుట్టుపక్కల వెతికింది.
ఇంటికి కాస్త దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో పసి పాప అపస్మారక స్థితిలో పడి ఉందని, స్థానికులు చెప్పడంతో అక్కడకు వెళ్లి చూస్తే తన బిడ్డే అక్కడ పడి ఉంది. ఆ పసిపాప ఒంటిపైనున్న గాయాలు చూసి ఆ తల్లి గుండె పగిలింది. వెంటనే ఆ పాపను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాప పెదవులు, మర్మావయాలపై గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం పాపను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
గ్రామంలో పలువురు అనుమానితులను విచారించారు. తమ కుటుంబంపై కక్ష పెంచుకున్నవారే ఈ అఘాయిత్యానికి పాల్పడ ఉంటారని చిన్నారి తల్లి పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేసింది. ఏడు నెలల పసికందుపై అఘాయిత్యానికి పాల్పడిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ అఘాయిత్యానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.