స్టార్ హీరోలుగా వెలుగొందిన హీరోలు.. ఇఇప్పుడు విలన్లుగా రాణిస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్, సునీల్ ఇప్పుడు ఈ బాటలో నడుస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరైన సంజయ్ దత్ ఇప్పుడు విలన్ గా మారిపోయారు. అయితే ఆయనకు ప్రమాదం జరిగిందని వార్తలు వస్తున్నాయి..
గతంలో స్టార్ హీరోలుగా వెలుగొందిన నటులు.. ఇప్పుడు విలన్లుగా మారిపోతున్నారు. హీరోలుగా ఫేడ్ అవ్వడంతో, వీరితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు కూడా ముందుకు రాకపోవడంతో విలన్స్ పాత్రతోనైనా మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. నిజం చెప్పాలంటే హీరోలతో సమానంగా ఈ స్టార్ విలన్లు రెమ్యునరేషన్స్ ఉంటున్నాయని సినీ ఇండస్ట్రీ వినికిడి. టాలీవుడ్లో జగపతి బాబు పూర్తి స్థాయిలో విలన్గా మారిపోగా.. తొలి నాళ్లల్లో విలన్, కామెడీ పాత్రలు చేసి ఆ తర్వాత హీరోలుగా మారిన శ్రీకాంత్, సునీల్ సైతం ఇప్పుడు ఇటు వైపుగా అడుగులు వేస్తున్నారు. ఆ కోవకే చెందుతారు బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్. దక్షిణాదిలో కేజీఎఫ్ సినిమాతో విలన్గా మారడంతో ఆయనకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
కేజీఎఫ్లో అధీరా పాత్రలో తనలోని సరికొత్త విలనిజాన్ని చూపించారు సంజయ్. దీంతో కన్నడ నుండే కాకుండా తమిళ్ సినిమా కూడా ఆయనకు ఆహ్వానం పలుకుతుంది. కాగా, ఓ సినిమా షూటింగ్లో భాగంగా సంజయ్ దత్ గాయపడ్డారట. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ్ సర్జా హీరోగా రూపొందుతోన్న చిత్రం కేడీ. ఈ సినిమాలో సంజయ్ విలన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ బెంగళూరులో జరుగుతుంది. ఓ ఫైట్ సీక్వెన్స్ తీస్తుండగా ఆయన గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఫైట్ మాస్టర్ రవి వర్మ నేతృత్వంలో ఓ భారీ బాంబు పేలుడు సన్నివేశం తీస్తుండగా ఈ ఘటన జరిగిందని సమాచారం.
సంజయ్ దత్ ముఖానికి, చేతికి, భుజానికి గాయాలు అయ్యాయట. దాంతో వెంటనే చిత్రీకరణ నిలిపివేసి హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోందని, సంజయ్ దత్ అభిమానులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని కన్నడ చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు ఇడియట్ హీరోయిన్ రక్షిత భర్త ప్రేమ్ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, సంజయ్ దత్ .. తమిళ అగ్ర నటుడు విజయ్ నటిస్తున్న లియో చిత్రంలో కూడా నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.