ఫిల్మ్ డెస్క్- సాయి పల్లవి.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో అందరిని ఫిదా చేసిన ఈ ముద్దు గుమ్మ.. ఇక వెనక్కి తిరిగి చూచుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ అందరిని అలరిస్తోంది. అందులోను సాయి పల్లవి డ్యాన్స్ కు అభిమానులే కాదు, సినిమా స్టార్స్ కూడా ఫిదా అవుతున్నారు.
తాజాగా లవ్ స్టోరీ ప్రీరిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సాయి పల్లవితో డ్యాన్స్ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక చాలా రోజుల తరువాత మళ్లీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్స్టోరి చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. లవ్ స్టోరీ సినిమా భారత్ లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.
లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి నటన గురించే అంతటా చర్చ జరుగుతోంది. అందులోను సాయి పల్లవి నటన, డ్యాన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్బాబు సాయిపల్లవిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.
సాయి పల్లవి తెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది.. అసలు ఆమెకు బోన్స్ ఉన్నాయా? స్ర్కీన్పై ఎవరూ ఆ తరహాలో డ్యాన్స్ చేయడం చూడలేదు.. అని మహేశ్ ట్వీట్ చేశారు. మహేశ్ బాబు ట్వీట్కు సాయిపల్లవి సమాధానం ఇచ్చింది. మీ మాటలు నాకు మరింత ఎనర్జీని ఇస్తున్నాయి.. నాలో ఉన్న మీ ఫ్యాన్ మీ ట్వీట్ను ఇప్పటికీ మిలియన్ టైమ్స్ చదివేసింది.. మీ ప్రశంసలకు కృతజ్ఞురాలిని.. మహేశ్ సర్.. అంటూ సాయి పల్లవి ట్వీట్ చేసింది.