హైదరాబాద్ క్రైం- టాలీవుడ్ నటుడు సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో ఎముక విరిగింది. సాయి ధరమ్ తేజ్ ఇంకా అపస్మారక స్థితిలోనే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మొదట స్థానికంగా ఉన్న మెడికవర్ ఆస్పత్రిలో వైద్యం తీసుకోగా, అక్కడ్నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
సాయి ధరమ్కు ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఎప్పటికప్పుడు బులెటిన్ను రిలీజ్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిందని తెలియగానే మెగా ఫ్యామిలీ అంతా జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్ తదితరులంతా ఆస్పత్రిలోనే ఉన్నారు.
ఎప్పటికప్పుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఆయనకు ప్రాణాపాయం ఏంలేదని తెలిశాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక సాయి ధరమ్ శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగా కట్టిన కేబుల్ బ్రిడ్జిపై నుంచి వెళ్తే తొందరగా వెళ్లొచ్చనే ఉద్దేశంతో చాలా మంది ఇదే దారిలో వెళ్తుంటారు.
కేబుల్ బ్రిడ్జిని దాదాపు దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ రోడ్డుపై ఇసుక ఉండటంతో వేగంగా వస్తున్న బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో బైక్ ఒకవైపు పడగా, సాయి ధరమ్ తేజ్ మరోవైపు కింద పడ్డాడు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న మెగా అభిమానులు తీవ్ర విషాదంలో ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి సంబందించిన సీసీ టీవీ ఎక్స్ క్లూజివ్ వీడియో చూడండి.