అమరావతి- తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సీజన్ అందక 11 మంది చనిపోయిన ఘటన రాజకీయంగా కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారి విజృంబిస్తున్నఈ సమయంలో తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణమృదంగం మోగడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయాందోళకు గురిచేసింది. కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న రోగులు ఆక్సీజన్ అందక చనిపోయారని తెలిసిన వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో రుయా ఘటనకు జగన్ ప్రభుత్వ అసమర్థతే కారణమనే విమర్శళు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యత వహించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
రుయా ఆస్పత్రి ఘటనకు నైతిక భాధ్యత వహించి సీఎం జగన్ రాజీనామా చేయాలంటూ తెలుగు దేశం, జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రలు కొందరు పెద్ద ఎత్తున ట్విట్టర్లో కామెంట్ చేస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ రిజైన్ జగన్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడు ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ రిజైన్ జగన్ (#ResignJagan ) ట్రెండింగ్ కొనసాగుతోంది. కరోనా రోగులకు చికిత్స అందించే సమయంలో ఆక్సీజన్ నిల్వలు కూడా చూసుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉంటే.. ఇక ప్రజల ప్రాణాలకు రక్షణ ఎవరన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడలేని పాలకులు అధికారంలో ఉండి ఏంలాభం అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఐతే రుయా ఆస్పత్రి ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు జగన్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది.