అమరావతి- దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. మరణాల సంఖ్య కూడా తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా నియంత్రణలోకి వచ్చింది. మరోవైపు భారత్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో సుమారు 28 కోట్ల మందికి కరోనా టీకా వేశారు. ఇక కొవిడ్ వ్యాక్సినేషన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందు దూసుకుపోతోంది. దశంలోనే రికార్డు స్థాయిలో కరోనా టీకా కార్యక్రమాన్ని అమలుచేస్తోంది ఆంధ్రప్రదేశ్. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మరోసారి వ్యాక్సినేషన్లో తన సత్త చాటింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏపీ కొత్త రికార్డు నెలకొల్పింది.
గతంలో ఒకే రోజు 6 లక్షల మందికి కరోనా టీకా వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఆదివారం ఒక్క రోజు సుమారు 8 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్న జగన్ ప్రభుత్వం, ఆ లక్ష్యాన్ని సునాయాసంగా అదిగమించి ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. ఉదయం నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒక ఉద్యమంగా సాయంత్రం వరకు కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 2,232 వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రత్యేక డ్రైవ్గా చేపట్టారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపుతో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి అవసరమైన శిక్షణను ఇప్పించడం ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశావర్కర్లు, ఏఎన్ఎంలకు వ్యాక్సినేషన్లో అవసరమైన శిక్షణను అందించడం, ప్రతి 50 ఇళ్లకు నియమించిన వాలంటీర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అవగాహన కల్పించడం వల్ల ఒకేరోజు లక్షలాది మందికి వ్యాక్సిన్ను అందించే సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ సొంతం చేసుకుంది. ఒకే రోజు 13 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డ్ సృష్టించి అందరి ప్రసంశలను అందుకుంటోంది.