ఐసీయూ బెడ్స్, ఆక్సీజన్, మందుల కోసం సెర్చ్ చేస్తున్న జనం
సైబర్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
క్రైం డెస్క్- గూగుల్.. మనకు ఏ సమాచారం కావాలన్న గూగుల్ నే ఆశ్రయిస్తాం. గూగుల్ లేనిదే ఇప్పుడు ఏ పని జరగడం లేదు. ప్రస్తుతం కరోనా నేపధ్యంలో గూగుల్ ఆధారంగా అన్ని రకాల సేవలను పొందుతున్నారు. కానీ కరోనా వైరస్ విస్తరిస్తున్న ఈ సమయంలో దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో చాలా చోట్ల ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని చోట్ల ఆక్షిజన్ అందని దుస్థితి దాపురించింది. దీంతో చాలామంది ఆక్సీజన్ కోసం, ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం,అంబులెన్స్ కోసం, మందుల కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. గూగుల్లో చూపించే నంబర్లకు కాల్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం కరోనా అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొందరు సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ఇదే అదునుగా బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు తమ నెంబర్లను పెట్టి డబ్బులు దండుకుంటున్నారు.
వైరస్ బారినపడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్న తమవారిని కాపాడుకోవాలన్న తొందరలో కొందరు గూగుల్ లో వైద్యం, ఐసీయూ బెడ్లు, అంబులెన్స్ కోసం వెతుకుతున్నారు.దీంతో కొందరు సైబర్ నెరగాళ్లు తమ ఫోన్ నంబర్లు పెట్టి, ముందుగా కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా పే చేయమని అడుగుతున్నారు. వారు మోసగాళ్లని తెలియక గుడ్డిగా నమ్మి వైద్యం అందించాలన్న తొందర్లో వారు చెప్పిన డబ్బులు ఆన్ లైన్ ద్వార చెల్లించేస్తున్నారు. ఆ తరువాత వాళ్లు చెప్పిన ఆస్పత్రికి వెళ్లి మోసపోయామని షాక్ అవుతున్నారు. ఇలాంటి కంప్లైంట్స్ తమకు చాలా అందాయని పోలీసులు చెబుతున్నారు. గూగుల్లో ఉండే ఫోన్ నంబర్లను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకని మీరు గూగుల్ లో ఇలాంటి సమాచారం కోసం వెతికే సమయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి మరి.